కరోనా లాక్డౌన్: ఇంటింటికీ వెళ్లి మరీ రక్తం సేకరణ, బ్లడ్ షార్టెజ్ నేపథ్యంలో డీసీఏ డెషిసన్..
లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంక్ల్లో రక్తం డ్రై స్టేజీకి చేరుకుంది. ఏబీ పాజిటివ్ గ్రూపు రక్తం అయితే లేనే లేదు. మరో వారం రోజుల లాక్డౌన్ ఉండనుంది. దానిని పొడిగించే అవకాశం కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) చర్యలకు ఉపక్రమించింది. రక్తం నిల్వలు పడిపోతున్న నేపథ్యంలో డోనర్ల ఇంటికి వెళ్లి రక్తం సేకరించాలని నిర్ణయం తీసుకుంది.
రక్తం సేకరణ..
రక్తం సేకరించే అంశానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీచేశామని డీసీఏ తెలిపింది. డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు ఆర్డర్ జారీచేశామని డీసీఏ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా తెలిపారు. రోగులకు రక్తం అత్యవసరం అవుతోందని... అందుకోసమే రక్తం సేకరించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సంబంధిత అధికారులు డ్రగ్ వ్యాన్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి రక్తం సేకరిస్తారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో తమ వాహనాలు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రీతి మీనా తెలిపారు.
నో క్యాంప్స్..
డోనర్ల ఇంటి వద్దకెళ్లి మాత్రమే బ్లడ్ సేకరించాలని ప్రీతి మీనా స్పష్టంచేశారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో క్యాంపులు నిర్వహించొద్దని తేల్చిచెప్పారు. రక్తం ఇచ్చేవారిని బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ప్రోత్సహిస్తారని ప్రీతి మీనా తెలిపారు.
బ్లడ్ షార్టెజ్..
రాష్ట్రంలో ఒక్కో బ్లడ్ బ్యాంక్కు నెలకు 500 నుంచి 1000 మందికి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. రోగుల బంధువులు రక్తం ఇచ్చి, తమకు అవసరమైన రక్తం తీసుకునేవారు. అత్యవసరం ఉన్న వారు మాత్రమే బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తీసుకునేవారు. తలసేమియా వ్యాధి ఉన్న చిన్నారుల పేరెంట్స్ రక్తం సేకరించేవారు. కానీ ప్రస్తుతం రక్తం సేకరించడం కష్టమవుతోంది. ఏబీ నెగిటివ్ రక్తం అయితే దొరకడం లేదు. ఒకవేళ డొనర్ దొరికినా.. అతనిని ఆస్పత్రికి తీసుకురావడం కష్టంగా మారుతోంది. ఇందుకోసమే బ్లడ్ వ్యాన్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి రక్తం సేకరించాలని డీసీఏ నిర్ణయం తీసుకుంది.