నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మరో మహారాష్ట్రే: కరోనాపై సర్కారు తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్కారు అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు పిలుపునిస్తోంది. అంతేగాక, కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే మాస్కులు ధరించకుంటే జరిమానాలను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రేపటి మహారాష్ట్ర..
కరోనావైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు. గతంతో పోలిస్తే కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోందన్నారు శ్రీనివాస్.
మునుపటి కంటే వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి
ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే.. గంటల్లోనే మిగితా వారికి వ్యాపిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు బయట మాత్రమే మాస్కు ధరించమని చెప్పామని.. ఇకపై ఇంట్లో ఉన్నా మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయన్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే లాక్డౌన్ విధించడం లేదన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకుంటే పరిస్థితి విషమిస్తుందని మరోసారి హెచ్చరించారు.
బీర్కూర్లో కరోనా కలకలం
ఇది ఇలావుండగా, కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 60 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి మండల వ్యాప్తంగా గత పది రోజుల్లో 360 కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి రవిరాజా తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. కాగా, తెలంగాణలో కొత్తగా 2157 కరోనా కేసులు నమోదు కాగా, 8 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 361 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు ప్రజలకు సూచిస్తోంది.