coronavirus: కొత్తగూడెం డీఎస్పీపై 1897 ఎపిడెమిక్ డిసిజ్ యాక్ట్ కేసు, కుమారుడికి పాజిటివ్..
కరోనా మహమ్మరి విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించి కఠినచర్యలకు ఉపక్రమించింది. అయితే బాధ్యతగల డీఎస్పీ ఒకరు తన కుమారుడిని క్వారంటైన్లో ఉంచకుండా.. బయటకు వదిలేశాడు. దీంతో తండ్రిపై ప్రభుత్వం కేసు పెట్టింది. పోలీసు ఉన్నతాధికారిగా ఉండి, తగిన చర్యలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసింది. డీఎస్పీ స్థాయి అధికారిపై కేసు ఫైల్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
డీఎస్పీ తీరు ఇది..
భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు ఇటీవల లండన్ నుంచి వచ్చారు. కరోనా పరీక్షలు చేసి.. క్వారంటైన్లో ఉంచాల్సింది పోయి..కుమారుడితో పాటు బంధువుల ఇంటికు వెళ్లారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం వెళ్లినట్టు తెలిసింది. వైరస్ లక్షణాలుంటే ఆస్పత్రి, లేదంటే ఇంట్లో క్వారంటైన్లో ఉండాల్సింది పోయి.. గృహ ప్రవేశానికి వెళ్లి వైరస్ సోకేందుకు కారణమయ్యారు.
కరోనా పాజిటివ్
డీఎస్పీ కుమారుడికి వైద్య పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో కొత్తగూడెం పోలీసులు ఉలిక్కిపడ్డారు. కుమారుడితోపాటు డీఎస్పీకి కూడా వైరస్ సోకిందా..? అతనితో తాము సన్నిహితంగా ఉన్నామని భయపడుతున్నారు. కుమారుడితోపాటు డీఎస్పీ కుటుంబాన్ని పరీక్షల కోసం వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద డీఎస్పీపై కేసు నమోదు చేశారు.
వైరస్ వణుకు
డీఎస్పీ కుటుంబం, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిన వారికి కూడా వైరస్ సోకిందా అనే అనుమానం నెలకొంది. జిల్లా కార్యాలయంలో ఉన్నవారికి, అటు బంధువులకు పరీక్షలు చేయనున్నారు. ఇటు క్వారంటైన్లో ఉండకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిపై సర్కార్ కొరడా ఝులిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన 60 మందిపై 1897 ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇళ్ల నుంచి ఒకరి కన్నా ఎక్కువమంది వచ్చిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.