corona: కేసీఆర్ సంచలనం: సీఎం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు జీతాల్లో భారీ కోత, ఎంతంటే?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం సమీక్షించిన సీఎం కేసీఆర్.. ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత విధించాలని నిర్ణయించారు.
ఏప్రిల్ 7కు కరోనా ఫ్రీ తెలంగాణ: ఆ దరిద్రులకు కరోనా సోకాలి: కేసీఆర్, ఇతర రాష్ట్రాల కూలీలకు అభయం
సీఎం నుంచి జీతాల కోత..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనావైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతోందని, ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తప్పవన్నారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం కేసీఆర్ ఈ జీతాల కోత నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాప్రతినిధుల జీతాల్లో భారీ కోతలు..
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాళ్లో 75శాతం కోత విధిస్తారని తెలిపారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60శాతం, మిగితా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తామని చెప్పారు.
Recommended Video
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోతా అంతే..
నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో పన్నులు ఆగిపోవడంతో, ఇతర ఆదాయాలు కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.