కరోనా: ఉమ్మితో వైరస్ వ్యాప్తికి చాన్స్.. తెలంగాణలో నిషేధాజ్ఞలు
చదువు-హోదా, పేదా-గొప్ప, జ్ఞానం-పరిజ్ఞానం.. వేటితో సంబంధం లేకుండా చాలా మంది అలవోకగా.. ఎక్కడపడితే అక్కడ చేసే పని.. ఉమ్మేయడం. సివిక్ సెన్స్ సంగతి పక్కనపెడితే, కామన్ సెన్స్ కూడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో అడ్డగోలుగా ఉమ్మేవాళ్లు ఇక నోరు మూసుకోవడం మంచింది. కరోనా మహమ్మారి మానవాళికి నేర్పుతున్న పాఠాల్లో పరిసరాల పరిశుభ్రత అతి ప్రధానమైంది. దాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని పూర్తిగా నిషేధించింది.
కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న దరిమిలా, ఉమ్మి ద్వారానూ వైరస్ తోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ మేరకు ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి బుధవారం నిషేధాజ్ఞల జీవో జారీచేశారు. ఉత్తిపుణ్యానికి కాండ్రించి ఉమ్మడం, పొగాకును నమిలి ఉమ్మడి, నాన్ టొబాకో ఉత్పత్తులు(చూయింగ్ గమ్ లాంటివి) బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం ఇకపై నిషేధం. ప్రజారోగ్య పరిరక్షణ నిమిత్తం తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఆస్పత్రుల వద్ద ఉమ్మేయడంపై నిషేధం కొనసాగుతున్నది. తెలంగాణ సర్కారు తాజా ఆదేశాలతో ఇప్పుడది బహిరంగ ప్రదేశాలకు కూడా వర్తించనుంది. అయితే నిషేధాన్ని ఉల్లంఘించినవారికి ఎలాంటి శిక్షలుంటాయనేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాలో ఆస్పత్రి గోడలపై ఉమ్మేసిన కారణంగా 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు.