తల్లి సంవత్సరీకానికి రాలేకపోయిన కిషన్ రెడ్డి, ఢిల్లీలోనే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్యామిలీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దీంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజలంతా కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తమ తమ ఇళ్లల్లోనే ఉంటున్నారు.
లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలకే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా కట్టడికి చేసే కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మా అమ్మగారు శ్రీమతి ఆండాళమ్మ గారి మొదటి పుణ్యతిథి సందర్భంగా, ఢిల్లీ నివాసంలో శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వహించాను. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
— G Kishan Reddy (@kishanreddybjp) April 13, 2020
దేశానికి మరింత సేవచేసేందుకు, శక్తి,యుక్తులను ఇవ్వాలని, మా అమ్మ గారిని ప్రార్ధించాను. pic.twitter.com/XnbNUCSuJH
ఈ క్రమంలో తన తల్లి సంవత్సరీకం స్వగ్రామంలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. ఢిల్లీలోని తమ నివాసంలోనే కేంద్రమంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి కిషన్ రెడ్డి భార్య, పిల్లలు, సోదరులు, ఇతర బంధువులూ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న తాను స్వయంగా లాక్డౌన్ నియమాన్ని ఉల్లంఘించాలని అనుకోలేదని, అందుకే ఇక్కడే కార్యక్రమం నిర్వహించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో కరోనా నియంత్రణలో ఉందని చెప్పారు.
42 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్కు..
రోమ్ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారని చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ రెండు ప్రత్యేక బస్సులో ఈ 42 మంది హైదరాబాద్ చేరుకున్నారు. మరొకరి కరోనా పరీక్షల రిపోర్టు రావాల్సి ఉండటంతో ఛావ్లాలోని ఐటీబీపీ క్యాంపులో ఉన్నాడు.
లాక్డౌన్ పొడగింపు..?
కాగా, కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా మార్చి 24 నుంచి మూడు వారాలపాటు ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14తో ఈ లాక్డౌన్ గడువు ముగుస్తుండటంతో మరోసారి లాక్డౌన్ పెంచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. దేశంలో ఇప్పటి వరకు 9,152 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 308 మంది మరణించారు. మరో 857 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.