కరోనాను మించిన షాక్... ప్రైవేట్లో రూ.16లక్షల బిల్లు... ఆస్తులు అమ్ముకున్నా చెల్లించలేని స్థితి...
కరోనా ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలు దందాకు తెరలేపాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న లక్షన్నర ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఫీవర్ ఆస్పత్రి డ్యూటీ మెడికల్ ఆఫీసర్(డీఎంవో)ను తుంబే ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఓ ప్రముఖ ఆస్పత్రి 83 ఏళ్ల వృద్దుడికి కరోనా చికిత్స కోసం 9 రోజులకు గాను రూ.10.5లక్షలు బిల్లు వేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త మరో ఘటనను వెలుగులోకి తీసుకురావడం కూడా సంచలనం రేపింది. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది.
బెంగళూరులో 60 శాతం కరోనా పాజిటివ్: వెహికిల్స్ రానీయని స్థానికులు, డప్పు చాటింపు
అసలేం జరిగింది...
యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆటో డ్రైవర్(28) కొద్దిరోజుల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. స్థానిక వైద్యులకు చూపించగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. దీంతో జూన్ 23న పేషెంట్ కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు... పేషెంట్ న్యుమోనియాతో బాధపడుతున్నాడని... సరైన ట్రీట్మెంట్తో తగ్గిపోతుందని చెప్పారు.
మంగళవారం రోగి మృతి...
అయితే ఆస్పత్రిలో ట్రీట్మెంట్కు రోజు రూ.50వేలు-రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఇదే క్రమంలో జూన్ 25న కరోనా టెస్టులు చేయగా... అతనికి పాజిటివ్గా తేలింది. చికిత్స పొందుతూ మంగళవారం(జూలై 7) తెల్లవారుజామున అతను మృతి చెందాడు. అప్పటికే మృతుడి కుటుంబ సభ్యులు చికిత్స కోసం రూ.6.3లక్షలు చెల్లించారు. కానీ మరో రూ.5లక్షలు పెండింగ్లో ఉందన్న కారణంతో ఆస్పత్రి యాజమాన్యం కుటుంబ సభ్యులను మొదట అతని మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదు.
మంత్రి జోక్యంతో...
తమకు తెలిసినవాళ్ల ద్వారా ఆ కుటుంబం రాష్ట్రానికి చెందిన ఓ మంత్రిని ఫోన్లో సంప్రదించారు. ఊళ్లో తమకున్న భూమిని అమ్మేసి ఇప్పటివరకూ బిల్లు కడుతూ వచ్చామని.. ఇక తమ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని మంత్రితో చెప్పారు. దీంతో ఆ మంత్రి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత అంత్యక్రియల నిమిత్తం రూ.20వేలు కట్టించుకున్నారు. ఆ తర్వాత మృతుడి కూతురికి పీపీఈ కిట్ వేసి మృతదేహాన్ని చూపించారు. అనంతరం ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో అధికారుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆస్పత్రి యాజమాన్యం వివరణ..
తాజా ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ.. రోగికి చేసిన ట్రీట్మెంట్కు రూ.16లక్షలు బిల్లు అయింన్నారు. రూ.3లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు రూ.2లక్షలు నగదు చెల్లించారని చెప్పారు. మూడు రోజుల క్రితం పెండింగ్ బిల్లు కడుతానని చెప్పిన రోగి బంధువు ఇప్పటివరకూ అందుబాటులోకి రాలేదన్నారు. అయినప్పటికీ మృతదేహాన్ని వాళ్లకు అప్పగించేశామని.. ఎవరినీ ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని స్పష్టం చేశారు.