అవినీతి: జగిత్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అరెస్ట్, 20రోజుల రిమాండ్
జగిత్యాల: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగిత్యాల మొదటి శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ మధును అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు ఆదేశంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటలకు జగిత్యాల శ్రీరామా చౌరస్తాలోని మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్లారు.
ఇంట్లో సోదాలు జరపగా లెక్కలు చూపని రూ. 4.20 లక్షల నగదు, ఓ కేసులో డిపాజిట్ చేసిన ఆరు మొబైల్ ఫోన్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు ఖాతాలు పరిశీలించగా అందులో రూ. 2 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వాటికి లెక్కలు ఉండటంతో కేసులో చూపలేదు.
ఏసీబీ అదనపు ఎస్పీ మాదాడి రమణకుమార్, డీఎస్పీ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో 8 మంది సీఐలు సోదాల్లో పాల్గొన్నారు. కేసు కొట్టి వేసేందుకు న్యాయవాది చీటి రామక్రిష్ణారావు కేసులో రూ. 10 వేలు, న్యాయవాది కొండపల్కల వెంకటేశ్వర్రావు కేసులో రూ. 50 వేలు మెజిస్ట్రేట్ మధుకు ఇచ్చినట్లు తేలిందని ఏసీబీ డీఎస్పీ కిరణ్కుమార్ చెప్పారు.
కాగా, శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హైకోర్టు అనుమతి, ఉన్నతాధికారుల ఆదేశంతో అవినీతి కేసులో అరెస్టయిన జగిత్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మధును కరీంనగర్ జైలుకు తరలించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం రాత్రి 11.15 గంటలకు కరీంనగర్లోని ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు మధుకు ఏప్రిల్ 20 వరకు రిమాండ్ విధించారు.