నెలకు రూ. 50 వేల కమిషన్: చిక్కుల్లో పడిన బాబూమోహన్
మెదక్: తెలుగు సినీ నటుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు బాబూమోహన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెదక్ జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ మెస్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.50 వేలు లంచంగా స్వీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తూ ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్టు సమాచారం.
మెస్లో అందించే ఆహారం నాణ్యత లోపించిందంటూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తక్షణం మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్ నోరు విప్పి అసలు విషయం చెప్పేశాడు. ఆంధోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్కు నెలకు రూ.50 వేల చొప్పున మామూళ్లు సమర్పించుకుంటున్నట్టు చెప్పాడు.
గత ఐదు రోజులుగా జెఎన్టియులో మెస్ నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్నారు. దీంతో క్యాంపస్ ప్రిన్సిపాల్ కాంట్రాక్టర్ను మార్చి కొత్త కాంట్రాక్టర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. దాంతో బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ స్వయంగా వచ్చి అన్నం బాగానే ఉందని విద్యార్థులే ఉద్దేశ్యపూర్వకంాగ గొడవలు చేస్తున్నారని అన్నాడు. దాంతో విద్యార్తులు మరింత రెచ్చిపోయి ఓసారి అన్నం తిని చూడాలని కాంట్రాక్టర్ను నిలదీశారు. దీంతో బాబూ మోహన్ వ్యవహారం బయటపడింది.
తనపై వచ్చిన ఆరోపణలపై బాబూ మోహన్ స్పందించారు. ఈ వ్యవహరంపై కాలేజీ ప్రిన్సిపాల్ ఎలాంటి విచారణనైనా జరిపించుకోవచ్చని సూచించారు. మెస్ నిర్వహణ సక్రమంగా లేకపోతే కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆయన ప్రిన్సిపాల్ను ఆదేశించారు. తాను ఎవరి వద్ద కూడా డబ్బులు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.