'వైయస్ హయాం కంటే తెలంగాణ ప్రభుత్వంలో పదిరెట్ల అవినీతి'
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి పదిరెట్లు పెరిగిందని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ మంచిదే కానీ అంచనాలు మాత్రం భారీగా పెంచారని ఆరోపించారు.
పనులు పూర్తి చేయని వాళ్లకే మళ్లీ కాంట్రాక్టులు ఇచ్చారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రీడిజైనింగ్ అంటూ చెప్పడం సరికాదన్నారు. వైయస్ హయాం కంటె తెలంగాణలో అవినీత బాగా పెరిగిందని విమర్శించారు.
ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి వేల కోట్లు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులోని 28 ప్యాకేజీలకు కొత్త టెండర్లు పిలవకుండా పాత అంచనాలకే 50 నుంచి 80 శాతం పెంచడంలో అవినీతి ఉందన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుస్తోందన్నారు. ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలలోను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో కలిపి ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ట్యాంపరింగ్ వల్ల వరంగల్, ఖమ్మంలలోను టిఆర్ఎస్సే గెలువవచ్చునని చెప్పారు. అంతమాత్రాన తెరాసకు ప్రజాధరణ ఉన్నట్లు కాదన్నారు.
లకారం చెరువును పరిశీలించిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోన్నారు. మధ్యాహ్నం నుంచి ఆయన బిజీబిజీగా ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు లకారం చెరువును పరిశీలించారు. కెసిఆర్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. లకారం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామన్నారు.
అంతకు ముందు ఆయన ఆర్టీసీ కొత్త బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. రమణగుట్టలో పర్యటించిన సీఎం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.