కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
Recommended Video
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 123 చోట్ల ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితాల సరళి వెలువడనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లోని 978 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల లోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. ఎంపీటీసీ ఓట్లు లెక్కింపు పూర్తైన అనంతరం జెడ్పీ ఓట్లు లెక్కించనున్నారు.
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో 35,529 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా... ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలవారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్లో ఉన్న ఓటర్ల వివరాలను ముందుగా లెక్కిస్తున్నారు. అనంతరం వాటిని 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున బండిల్ చేయనున్నారు.
బ్యాలెట్ పేపర్లు బండిల్ చేసే ప్రక్రియ మధ్యాహ్నం 12 వరకు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాతే బ్యాలెట్ పేపర్లు లెక్కించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని విప్పి అది చెల్లుబాటు అవుతుందా లేదా అన్న విషయాన్ని ఏజెంట్ల ఎదుట పరిశీలించి ట్రేలలో వేస్తారు. ఏమైనా అనుమాలుంటే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తెచ్చి నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం ఐదింటికల్లా పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది.