భలే దంపతులు, టీవీ కథనాలు చూసి చోరీలు: 93 చైన్ స్నాచింగ్లు
వరంగల్: వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న భార్యాభర్తలను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇప్పటి వరకు 93 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కారు డ్రైవర్ బానోతు రవి, వరంగల్ నగరానికి చెందిన డీఫార్మసీ విద్యార్థి ఎర్రం రాజేశ్వరి ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసు కున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కారు అమ్మేసి చోరీలకు దిగారు.
ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో ప్రతీరోజు రాత్రి టీవీ చానళ్లలో ప్రసారమయ్యే నేర కథనాలు చూసి వాటి పట్ల ఆకర్షితులయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లడం వృత్తిగా మా ర్చుకున్నారు.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 93 చోరీలకు పాల్పడ్డారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే రూ. 82లక్షల విలువైన 3కిలోల 10 గ్రా ముల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఎట్టకేలకు వారిని అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు నిందితుల వివరాలు వెల్లడించారు.
2013లో మొదటిసారిగా రవి హంటర్రోడ్లో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. భార్య రాజేశ్వరి సైతం అంగీకరించడంతో ఇరువురు కలిసి నేరాలకు పాల్పడేవారు. రాజేశ్వరి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా వెళ్తున్న మహిళల సమాచారం భర్త రవికి చేరవేసేది. తర్వాత రవి బైక్పై వెళ్లి బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళల కోసం మాటువేసి చైన్స్నాచింగ్లకు పాల్పడేవాడు.
ఆ తర్వాత భార్యను బైక్ మీద ఎక్కించుకుని ఏమీ తెలియనట్లుగా అనుమానం రాకుండా వెళ్లిపోయేవారు. వరుస చోరీలతో నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు ఆదివారం రాత్రి హంటర్రోడ్లోని ఓరుగల్లు పెట్రోల్ పంపువద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా దొంగిలించిన ఆభరణాలు విక్రయించేందుకు హైదరాబాద్ వెళ్తూ ఇద్దరు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాలను అంగీకరించారు. నిందితుల నుంచి దొంగిలించిన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు.
చోరీల చిట్టా ఇదీ..
దొంగవతారం ఎత్తిన దంపతులు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 93చోరీలకు పాల్పడ్డారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 77చోరీలు చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 24, హన్మకొండ పరిధిలో14, మిల్స్కాలనీ పరిధిలో 11, మట్వాడ పరిధిలో10, కేయూసీ పరిధిలో6, కాజీపేట పరిధిలో5, ఇంతేజార్గంజ్ పరిధిలో3, స్టేషన్ఘన్పూర్ పరిధిలో2, వర్ధన్నపేట, రాయపర్తిపరిధిలోఒకటి చొప్పున దొంగతనాలు చేశారు. ఖమ్మం జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 3, మంచిర్యాలలో ఒక చోరీకి పాల్పడ్డారు.