ముంచేసి, పెద్ద ట్విస్ట్ ఇచ్చింది?: గాంధీలో ఉద్యోగాల పేరుతో.. బాధితులు లబోదిబో!
కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట వసూలు చేసిన డబ్బును తిరిగి హెల్త్ ఇన్స్పెక్టర్ రవి కుమార్కే ఇచ్చానని లావణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది.
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం అనగానే చాలామందికి కాయిషు. లంచం అడిగినా సరే.. అప్పో-సప్పో చేసి ఉద్యోగంలో చేరాలనుకుంటారు. ఆ కాయిషే చాలామందికి డబ్బులు దండుకునే అవకాశంగాను మారింది.
తాజాగా గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల కొద్ది కుచ్చుటోపీ పెట్టిన ఓ మహిళ బాగోతం బయటపడింది. మోసపోయిన అమాయకులు లబోదిబోమంటున్నారు. లావణ్య అనే మహిళ చేసిన ఈ మోసంలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.
గాంధీలో ఉద్యోగాల పేరుతో:
సిద్దిపేటకు చెందిన లావణ్య (35) హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తానో ఉన్నతాధికారినని చాలామందిని నమ్మించింది. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, అటెండర్స్ లాంటి ఉద్యోగాలను తానే ఇప్పిస్తానని నమ్మబలికింది. దీంతో తెలిసినవారు, ఉద్యోగం కావాలనుకున్నవారు ఆమె చేతిలో భారీగా డబ్బు పెట్టారు. దాదాపు రూ.15లక్షల వరకు లావణ్య వారి వద్ద నుంచి వసూలు చేసింది.
డ్యూటీ కూడా వేయించింది:
ఉద్యోగాల పేరుతో కొంతమంది నుంచి డబ్బు దండుకున్ లావణ్య.. వారికి గాంధీలో ఫేక్ డ్యూటీలు కూడా వేయించింది. ఆసుపత్రి ఆవరణలోని చెట్ల కింద వారిని కాపలాగా పెట్టింది.
వాళ్ల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బుతోనే రెండు నెలలు జీతాలు కూడా చెల్లించింది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది దీన్ని గమనించలేకపోయారు. యూనిఫాం లేకుండా, ఐడీ కార్డులు లేకుండా డ్యూటీ చేయాల్సి వస్తుండటంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ఐడీ కార్డులు కావాలని సదరు సిబ్బంది హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్ను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
ఇన్స్పెక్టర్ నిలదీయడంతో:
మిమ్మల్ని ఇక్కడెవరు పనిచేయమన్నారు?.. అసలెవరు మీరు? అంటూ ఇన్స్పెక్టర్ రవికుమార్ ప్రశ్నించడంతో తాము మోసపోయామని వారు గ్రహించారు. వారి నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్యుమెంట్లు లాగేసుకుని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు లావణ్యను నిలదీయగా.. ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి మాయమైంది.
దౌల్తాబాద్లో ఫిర్యాదు:
బాధితులు 17 మంది దౌల్తాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని వారే అని తెలుస్తోంది. కాచిక్కుడు భాస్కర్ అనే వ్యక్తి తొలుత లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ స్వామి లావణ్య కోసం వారం రోజులుగా సెల్ఫోన్ ఆధారంగా గాలించినా ఫలితం లేకపోయింది. ఈనెల 10న ఎట్టకేలకు ఆమె పోలీసులకు చిక్కడంతో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
ఎవరీ లావణ్య:
ఉద్యోగాల పేరుతో మోసం చేసిన లావణ్య, కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలోనే పనిచేస్తున్న కనకరాజును వివాహం చేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో ఏర్పడ్డ పరిచయమే వీరి వివాహానికి దారితీసింది.
ఇటీవల లావణ్య గర్భవతి కావడంతో సీమంతం జరిపేందుకు కనకరాజు స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం, దీపాయంపల్లి వచ్చారు. ఈ సందర్భంగా శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించారు. శుభకార్యానికి వచ్చిన వాళ్లు తమను చాలా హైఫై అని భావించేందుకు ఓ అద్దె కారు తీసుకుని వెళ్లారు లావణ్య దంపతులు.
గాంధీలో తానో పెద్ద అధికారిగా శుభకార్యానికి వచ్చిన వాళ్లను నమ్మించారు. ఇలా చాలా మంది పరిచయం కావడంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలామందిని మోసం చేశారు.
ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ అకతవకలు:
గాంధీలో ఏంజెల్ ఔట్ సోర్సింగ్ అనే సంస్థ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు. లెక్క ప్రకారం ఆసుపత్రిలో ఆ సంస్థ ఆధ్వర్యంలో 200మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలి. కానీ కేవలం 20శాతం మంది మాత్రమే అక్కడ పనిచేస్తున్నారు.
కానీ ప్రభుత్వం నుంచి 200మందికి వేతనాలు రాబడుతున్నారు. ఆ డబ్బును కాంట్రాక్టరు తన జేబులో వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్కు ఈ విషయం తెలిసినా.. ఆయన దీర్ఘకాలిక సెలవుల్లో ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు.
ఇదో ట్విస్ట్:
కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట వసూలు చేసిన డబ్బును తిరిగి హెల్త్ ఇన్స్పెక్టర్ రవి కుమార్కే ఇచ్చానని లావణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది. నిజంగా లావణ్య-రవికుమార్ ఇద్దరు కుమ్మక్కై ఈ వ్యవహారానికి తెరదీసి ఉంటే.. 'మిమ్మల్ని ఇక్కడెవరు పనిచేయమన్నారు?' అని రవికుమార్ ఎలా ప్రశ్నిస్తారు?.. విచారణ జరిగితే కానీ ఈ విషయాలు తేలేలా లేవు.
లావణ్యను వెంబటెట్టుకొని పోలీసులు సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రికొచ్చారు. విధుల్లో ఉన్న రవికుమార్ను ఎస్సై స్వామి అదుపులోకి తీసుకోవడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగుల్ని పోలీసుల్ని అడ్డుకున్నారు.
హెల్త్ ఇన్స్పెక్టర్ రవి కుమార్పై ఆ రోపణ ఉందని అందుకే వచ్చామని చెప్పడంతో హెల్త్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ను సూపరింటెండెంట్ చాంబర్లో విచారించారు. అనంతరం హెల్త్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ మరింత సమాచారం రాబట్టేందుకు దౌల్తాబాద్ పోలీసులు సిద్దిపేట్కు తీసుకెళ్లారు.