మళ్ళీ పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి .. జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో మొదట రాకేష్ రెడ్డి ఒక్కడే హత్య చేసాడని భావించిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న వారిని విచారిస్తున్నారు పోలీసులు.
ఇంకా సమాచారం రాబట్టాల్సింది ఉంది .. అందుకే మళ్ళీ పోలీస్ కస్టడీ కి రాకేష్ రెడ్డి
మూడు రోజులపాటు రాకేష్ రెడ్డి ని తెలంగాణ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతడిని ఫిబ్రవరి 16వ తేదీన కోర్టు ఎదుట హాజరు పరిచారు. అంతకంటే ముందు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు పరిచారు పోలీసులు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, కేసులో మరింత సమాచారం రావాల్సి ఉన్నందున రాకేష్ రెడ్డి కస్టడీని పొడిగించాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మరో 8 రోజుల పాటు రాకేష్ రెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతించింది.మరో 8 రోజుల పాటు విధించిన కస్టడీలో రాకేష్ ఇంకా ఎలాంటి విషయాలు చెబుతాడో చూడాలి.
విచారణ వేగవంతం చేసిన పోలీసులు ..ఈ కేసులో కొత్తముఖాలు
వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. కీలకంగా అనుమానిస్తున్న శిఖా చౌదరిని కూడా పోలీసులు విచారించారు. చింతల్ రౌడీ షీటర్ నగేష్..అతడి మేనల్లుడు విశాల్, డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిలకు.. జయరాంను హత్యలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.జయరాంను చంపేస్తున్నట్లు...చనిపోతేనే ఆస్తులు వస్తాయని... మరో ముగ్గురికి రాకేష్ చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి , రౌడి షీటర్ నగేష్, ఆయన అల్లుడు విశాల్ తో కలిసి ప్లాన్ చేసి మరీ జయరాం ను హతమార్చాడు రాకేష్ రెడ్డి .
హత్య తర్వాత రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చిన సిరిసిల్ల కౌన్సిలర్ భర్త ... మరో ముగ్గురు అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పొలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో రాకేష్ రెడ్డి, శిఖా చౌదరిలను విచారించారు. జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
సిరిసిల్లకు చెందిన కౌన్సిలర్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంజిరెడ్డి, శ్రీను, రాములును విచారిస్తున్నారు. నిందితుడు రాకేష్ రెడ్డితో కలిసి ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. కౌన్సిలర్ భర్తతో రాకేష్ రెడ్డికి పరిచయం ఉంది. రాకేష్ రెడ్డి రూ.10 లక్షలు ఇవ్వాలని విచారణలో అంజిరెడ్డి వెల్లడించారు. జయరామ్ ను హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి, అంజిరెడ్డిని ఇంటికి పిలిచారు. రాకేష్ రెడ్డి ఇంట్లో జయరామ్ మృతదేహాన్ని చూసి అక్కడి నుంచి అంజిరెడ్డి, అతని మిత్రులు పారిపోయారు. హత్య విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు అంజిరెడ్డి, అతని మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిన రోజు రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఈ కేసులో వారు సైతం ఇరుక్కుపోయారు.