దిగ్విజయ్ సింగ్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ: తెలంగాణ నేతలకు కోర్టు సమన్లు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం నేత హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వారెంట్ ఇచ్చింది.
2016లో ఎంఐఎంపై చేసిన వ్యాఖ్యలకు గానూ దిగ్విజయ్ సింగ్పై పరువు నష్టం కేసు దాఖలైంది. అయితే, అనారోగ్యం కారణంగా విచారణకు మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోర్టును కోరారు. కానీ, ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.
మరోవైపు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు పంపింది. 2005లో టీడీపీ నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన కేసులో పోచారంతోపాటు పలువురికి సమన్లు పంపింది.
ఇక వరంగల్లోని సుబేదారి పీఎస్ పరిధిలో ఆందోళన చేపట్టగా.. ఆ కేసు వరంగల్ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డికి సమన్లు పంపింది.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. 2016లో నిర్వహించిన ఆందోళనలో వివేకానంద పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో లేరని జీడిమెట్ల పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.