భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్... ఫేజ్ 3 ట్రయల్స్కు గ్రీన్ సిగ్నల్... 22వేల మంది వాలంటీర్లపై...
దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కరోనా నివారణ కోసం తయారుచేస్తున్న కోవ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) గురువారం(అక్టోబర్ 22) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దశ ప్రయోగాల కోసం అక్టోబర్ 2న భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకోగా తాజాగా అందుకు అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు నవంబర్ మొదటివారంలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
22వేల మంది వాలంటీర్లపై...
మూడో దశ ప్రయోగాల కోసం దేశవ్యాప్తంగా 18-19 నగరాల్లో ఇప్పటికే 22వేల పైచిలుకు మంది వాలంటీర్లను భారత్ బయోటెక్ ఎంపిక చేసుకుంది. ఇందులో ఢిల్లీ,ముంబై,పాట్నా,లక్నో వంటి ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి. మూడో దశ ప్రయోగాలు కూడా విజయవంతంగా త్వరగా పూర్తయితే... సమీప భవిష్యత్తులోనే భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. తెలంగాణకు చెందిన ఈ ఫార్మా దిగ్గజం నుంచే భారత్లో తొలి కరోనా వ్యాక్సిన్ వస్తుందని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే విశ్వాసం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నిపుణుల కమిటీ ఏమంటోంది...
'టీకా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రతిపాదనతో పాటు ఇనాక్టివేటెడ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ (BBV 152) యానిమల్ ఛాలెంజ్ డేటా, మొదటి,రెండో విడత క్లినికల్ ట్రయల్స్ డేటాను డీజీసీఐకి భారత్ బయోటెక్ సమర్పించింది.' అని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(SEC) ప్యానెల్ వెల్లడించింది. ఒకసారి కరోనా అనుమానిత కేసును ధ్రువీకరించాక.. దాన్ని సింప్టమాటిక్ కేసుగా పరిగణించేందుకు కచ్చితంగా కొంత క్లినికల్ ఇన్ఫర్మేషన్ అవసరమని పరిశోధకులకు సూచించినట్లుగా ప్యానెల్ కమిటీ తెలిపింది.
క్రైటీరియా ఏ.. క్రైటీరియా బీ...
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(SEC) ప్రతిపాదన ప్రకారం... ఒక కరోనా అనుమానిత కేసును సింప్టమాటిక్ కేసుగా పరిగణించేందుకు ఆ పేషెంట్ క్రైటీరియా ఏ లేదా క్రైటీరియా బీ లక్షణాలు కలిగి ఉండాలి. క్రైటీరియా ఏ ప్రకారం... శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,అనోస్మియా,శరీరంలో ఆక్సిజన్ లెవల్ 94శాతం కంటే తక్కువగా ఉండటం,చెస్ట్ ఎక్స్రే లేదా సీటీ స్కాన్ ద్వారా నిమోనియా నిర్దారణ,ఐసీయూలో చేరిక వంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇక క్రైటీరియా బి ప్రకారం... జ్వరం,చలి,దగ్గు,తలనొప్పి,గొంతు నొప్పి,వాంతులు,డయేరియా,ముక్కు కారడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా 100 వ్యాక్సిన్లు
భారత్ బయోటెక్కు మూడో దశ ప్రయోగాలకు అనుమతితో పాటు జైదాస్ క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్కు ఫేజ్ 1,ఫేజ్ 3 క్లినికల్ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది. పుణేకి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఆస్ట్రాజెనెకాతో టైఅప్ అయ్యి ఫేజ్ 2,ఫేజ్ 3 ప్రయోగాలు నిర్వహిస్తోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కి పైగా వ్యాక్సిన్లు ప్రయోగాల దశలో ఉన్నాయి. నిజానికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఈ ఏడాది అగస్టు 15 నాటికే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించినప్పటికీ... ఆ తర్వాత సీన్ మారిపోయింది. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సి్న్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెల్లడించారు.