తెలంగాణలో కొత్తగా 1269 కేసులు, 8మంది మృతి.. భారీగా డిశ్చార్జీలు..
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఆదివారం ఒక్కరోజులోనే కొత్తగా 1269 మంది వైరస్ కాటుకు గురయ్యారు. అందులో 800 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కావడం గమనార్హం. ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ వైరస్ తాండవం చేసింది. రంగారెడ్డిలో 132 కొత్త కేసులు, మేడ్చల్ లో 94 కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత సంగారెడ్డి(36), కరీంనగర్(23), నాగర్ కర్నూలు(23) ఉన్నాయి.
ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. సచిన్ వెంట 30 మంది.. కొందరి యూటర్న్.. సోమవారమే సీఎల్పీ.
కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 34, 671కి పెరిగినట్లయింది. అందులో 356 ప్రాణాలు కోల్పోగా, రికార్డు స్థాయి రికవరీ రేటుతో 22,482 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఒక్క ఆదివారం నాడే 1563 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,883గా ఉన్నట్లు వైద్య శాఖ బులిటెన్ లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో కరోనా సోకినట్లు గతవారమంతా వార్తలు చక్కర్లు కొట్టగా, ఇప్పుడు గవర్నర్ నివాస స్థలం రాజ్ భవన్ లో నిజంగానే కరోనా కాటుకు గురైంది. అక్కడి సిబ్బందిలో కొందరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, గవర్నర్ కుటుంబం సహా మిగతా సిబ్బందికి, వారి కుటుంబాలకు కూడా టెస్టులు నిర్వహించారు. తను నెగటివ్ వచ్చిందని ప్రకటించిన గవర్నర్ తమిళిసై.. రెడ్ జోన్లలోని ప్రజలు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
Recommended Video
అటు దేశవ్యాప్తంగానూ ఆదివారం కొత్త కేసుల్లో మరో రికార్డు నమోదైంది. కొత్తగా 28,637 కేసులు జత కావడంతో భారత్ ట్యాలీ 8.7లక్షలకు పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 23వేలు దాటింది. అంతాకలిపి 5.5లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, దాదాపు 3 లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.3కోట్లకు పెరిగాయి. అందులో 75లక్షల మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 6లక్షలకు పెరిగింది.