కరోనా: ఒకే రోజు 4 మృతి, కొత్తగా 41 కేసులు.. తెలంగాణలో తగ్గని వైరస్ వ్యాప్తి..
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 41 మందికి వైరస్ సోకగా, మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 53కి పెరిగింది. ఇక, కొత్తగా వైరస్ బారిన పడిన 41 మందిలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధికి చెందిన వ్యక్తులు కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఒకరున్నారు. 11 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది.
ఆదివారంనాటి కొత్త కేసులతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,854కి పెరిగింది. కాగా, ఇవాళ 24 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 709 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది.
పాజిటివ్ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగానూ ఆదివారం మరో రికార్డు నమోదుకావడం విచారకరం. గడిచిన 24 గంటల్లో(ఒక్క రోజులోనే) కొత్తగా 6767 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,31,868కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 54,441 మంది వ్యాధి నుంచి కోలుకోగా, మరో 73,560 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా దేశంలో 6వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండటం తెలిసిందే.
Recommended Video