కరోనా విలయం: సూర్యాపేటలో ఔట్బ్రేక్.. ఒక్కరోజులోనే భారీగా.. మొత్తంగా వెయ్యికి దగ్గరగా..
దక్షిణాదితో తమిళనాడు తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ గా రాష్ట్రంగా కొనసాగుతోన్న తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వెళుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెలువరించిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి. సోమవారం కొత్త కేసుల సంఖ్య 14కే పరిమితంకాగా, మంగళవారం మాత్రం నాలుగింతలు ఎక్కువ నమోదుకావడం కలవరపెడుతోంది. మొత్తంగా కేసుల సంఖ్య 928కి పెరిగింది. ఇందులో 194 మంది కోలుకోగా, 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 711గా ఉంది.
ఇప్పటిదాకా కొత్త కేసుల నమోదులో హైదరాబాద్ (జీహెచ్ఎంసీ పరిధి)నే ముందుండేది. కానీ మంగళవారం రికార్డయిన కొత్త కేసుల్లో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో వెలుగుచూశాయి. అక్కడ 26 కేసులురాగా, జీహెచ్ఎంసీలో 19, నిజామాబాద్ లో 3, గద్వాల 2, ఆదిలాబాద్ 2, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తం కేసుల్లో మర్కజ్ సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతూవచ్చింది. మరి సూర్యాపేటలో వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందనేది ఇంకా తెలియాల్సిఉంది.
జిల్లాలవారీగా 479 కేసులతో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉండగా, నిజామాబాద్ ను వెనక్కి నెట్టి 70 కేసులతో సూర్యాపేట రెండో స్థానానికి చేరింది. నిజామాబాద్ లో కేసుల సంఖ్య 62గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వికారాబాద్(33), రంగారెడ్డి(26) జిల్లాలు ఉన్నాయి. వచ్చే రెండ్రోజులపాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను వాడొద్దని కేంద్రం, ఐసీఎంఆర్ ఆదేశించడంతో బుధ, గురువారాల్లో వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమైంది. నిజానికి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ర్యాపిడ్ కిట్స్ కంటే ఆర్టీ-పీసీఆర్ విధానంలోనే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.