కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?
ప్రత్యర్థులకు ప్రశ్నించే అవకాశమే లేకుండా పకడ్బందీ వాదనతో జనం ముందుకురావడం సీఎం కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్ఎస్కు అలవాటైనపనే. కానీ కొద్ది గంటలుగా ''కేసీఆర్ ఎక్కడ?'' అంటూ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సందేహాలు వ్యక్తమవుతున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, గులాబీ సేనలుగానీ అధికారిక ప్రకటనేదీ చేయలేదు. దీంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై, కరోనా విషయంలో తెలంగాణ దుస్థితిపై చర్చ మరింత ఊపందుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు భయానక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగబోతోందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
Recommended Video
జగన్ సర్కారు మరో రికార్డు.. కరోనా టెస్టుల్లో 10 లక్షల మైలురాయి.. ఇప్పటిదాకా ఈ రాష్ట్రాలు మాత్రమే..
సీఎంకు వైరస్ సోకిందా?
#WhereisKcr ఈ హ్యాష్ ట్యాగ్ ఆదివారం ట్విటర్లో ట్రెండింగ్లో టాప్ లో నిలిచింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం, కేసీఆర్ కు కూడా వైరస్ సోకిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో లక్షలాది మంది ప్రజలు దీనిపైనే చర్చించుకున్నారు. ప్రగతి భవన్ లో వైరస్ వ్యాప్తి తర్వాత ఆయన కుటుంబంతో సహా గజ్వేల్లోని తన ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. కాగా, కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వార్తల వెనుక అసలు కథ వేరే వుంది.
అసలేం జరిగిందంటే..
‘‘కేసీఆర్ కు కరోనా?'' అనే హెడ్డింగ్ తో హరితహారం క్యార్యక్రమంలో వైరస్ వ్యాప్తి చెందిందని, సీఎం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారనే వివరణతో ‘ఆదాబ్ హైదరాబాద్' పత్రికకు చెందిన న్యూస్ క్లిప్పింగ్ ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అయింది. ప్రఖ్యాత విశ్వసనీయ న్యూస్ ఏజెన్సీ ‘పీటీఐ'ని కోట్ చేస్తూ, ‘న్యూస్ మింట్'అనే వెబ్ సైట్ రాసిన వార్తే ‘ఆదాబ్ హైదరాబాద్' కథనానికి మూలమని వెల్లడైంది. హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా సోకిందన్న వార్తను.. పీటీఐ వాళ్లు ‘తెలంగాణలో ఓ మంత్రికి వైరస్'అనే అర్థంలో రాయగా, మింట్ వెబ్ సైట్ కూడా అదే హెడ్డింగ్ తో జూన్ 29న వార్త రాసింది. కానీ అలీ ఫొటోకు బదులు కేసీఆర్ ఫొటోను పెట్టడంతో చూడగానే, ముఖ్యమంత్రికే వైరస్ సోకిందనేలా అనిపించడం, దీనిపై తెలుగులోనూ విస్తృతంగా వార్తలు రావడం, అంతలోనే #WhereisKcr ట్రెండిగ్ లోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే..
ఇంతకీ సీఎం సేఫేనా?
ప్రపంచ దేశాల్లో చాలా మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, మన దేశంలోనూ కొంత మంది మంత్రులు అన్ని పార్టీల్లో కొందరు కీలక నాయకులు కూడా కరోనా బారినపడ్డారు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో, అందునా పబ్లిక్ కోసం, పబ్లిక్ లో పని చేసేవాళ్లకు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. తెలంగాణలో మాదిరే ఏపీలోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా కాటుకు గురై చికిత్స అనంతరం కోలుకున్నారు. కాగా, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ అటు ప్రభుత్వం నుంచిగానీ, ఇటు పార్టీ నుంచి గానీ చిన్న ప్రకటన కూడా రాకపోవడం ప్రజలను మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. సీఎం సేఫ్ గా ఉన్నారన్న రెండు పదాల వివరణ కోసం కోట్ల మంది ఎదురుచూస్తోన్న మాట కాదనలేని వాస్తవం. మరోవైపు..
ప్రగతి భవన్లో కరోనా.. కేసీఆర్ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..
అత్యధిక పాజిటివ్ రేటు..
కరోనా టెస్టులు విస్తృతంగా చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన దరిమిలా తెలంగాణ ప్రభుత్వం 50 వేల టెస్టులు నిర్వహించగా, ఫలితాలు షాకిచ్చేలా వచ్చాయి. 18 రోజుల వ్యవధిలో హైదరాబాద్, సిటీ శివారు ప్రాంతాల్లో 50 వేల మందిని టెస్టు చేస్తే.. 30.5 శాతం పాజిటివ్ రేటుతో 15,269 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇందులో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి 10 లక్షల మందిలో తక్కువ టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో బీహార్(1859) తర్వాతి స్థానంలో తెలంగాణ(2361) ఉంది. జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్త పాజిటివ్ రేటు 6.68% ఉండగా తెలంగాణలో పాజిటివ్ రేటు 18.7 శాతంగా నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం జోక్యం తప్పదంటూ..
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్నందు వల్లే ఇప్పుడు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందనే వాదన వినిపిస్తోంది. వైరస్ లక్షణాలు ఉండి కూడా ఎక్కడికెళ్లాలో తెలీని స్థితిలో ఉన్నామంటూ చాలా మంది సామాన్యులు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, సామాన్యులకు దిక్కయిన గాంధీ, చెస్ట్ లాంటి ఆస్పత్రుల్లో సౌకర్యాలపైనా విమర్శలు వస్తున్నాయి. వీటిని పట్టించుకోవద్దని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆశించిన భరోసా దక్కకపోవడంతో ప్రజలు ఆ ప్రకటనల్ని విశ్వసించే విషయంలో సంశయానికి గురవుతున్నారు. ఈలోపే, కేంద్రం జోక్యం తప్పదంటూ మరికొందరు ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడెవరీ బాధ్యత లేదు..
కేంద్ర ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తోన్న మాజీ ఐఏఎస్ సుజాతా రావు.. కరోనా క్రైసిస్ పై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిపై ఆమె చేసే కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘ఇప్పటికే కేంద్ర బృందాలు మూడు సార్లు హైదరాబాద్ వచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందనలో మార్పు రాలేదు. దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటు ఉన్న తెలంగాణలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకముందే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా జోక్యం చేసుకోవాలి. ఇక్కడెవరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు నాకు అనిపించడంలేదు'' అని సుజాతా రావు ట్వీట్ చేశారు.
ఏపీ - తెలంగాణకు పోలిక..
కరోనా నియంత్రణ చర్యల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశమైంది. దేశంలో 10లక్షల పైచిలుకు టెస్టులు నిర్వహమమించిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కితే, తెలంగాణలో మాత్రం అంతా కలిపి లక్ష పది వేల టెస్టులు మాత్రమే చేశారు. ఏపీలో అనుమానితులందరికీ టెస్టులు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం ఆస్పత్రులకు వెళ్లినా టెస్టులు జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక ఏపీలో కంటైన్మెంట్ జోన్లలో కట్టడి కఠినంగా కొనసాగితే, తెలంగాణ లో మాత్రం వ్యక్తులకు కరోనా ఉందని తేలినా ఆ ప్రాంతాన్ని కంటైన్ చేయడంలేదనే వార్తలు వస్తున్నాయి.