కరోనా బ్యాడ్ న్యూస్: తెలంగాణ జిల్లాల్లో - కొత్తగా 1982 కేసులు, 12 మంది మృతి - సెప్టెంబర్కు ఖతం?
తెలంగాణలో కరోనా వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్ మారిపోతున్నది. చాలా కాలంపాటు విశ్వనగరం హైదరాబాద్ కరోనాకు అడ్డాగా ఉండగా, ఇప్పుడా మహమ్మారి జిల్లాలు, పల్లెలను వణికిస్తున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లోనూ ఇది స్పష్టంగా వెల్లడైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 కేసులు నమోదుకాగా, అందులో మూడొంతుల కేసులు జిల్లాల నుంచే రావడం గమనార్హం.
Recommended Video
జగన్ పై సోము వీర్రాజు 'అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?
పెరిగిన మరణాలు..
కొత్తవాటితో కలిపితే తెలంగాణలో మొత్తం కేసులు 79,495కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనాకు బలైపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 627కు పెరిగింది. అయితే, జాతీయ సగటు(68.32 శాతం) కంటే తెలంగాణలో(70.44 శాతం) మెరుగైన రికవరీ రేటు ఉందని, అంతా కలిపి ఇప్పటివరకు 56వేల మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని బులిటెన్ లో పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,869గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.13లక్షల కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
సిటీలో తగ్గి.. జిల్లాల్లో పాగా..
ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం కొత్తగా 1982 కేసులు రాగా, అందులో 463 మంది మాత్రమే జీహెచ్ఎంసీ పరిధిలోనివాళ్లున్నారు. గతంలో టోటల్ కేసుల్లో సిటీ వాటానే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పట్టణాలు, పల్లెల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మొత్తం కేసుల్ల మూడొంతులు(1519) జిల్లాల నుంచే వచ్చాయి. జీహెచ్ఎంసీతోపాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తొలి నుంచీ కేసులు ఎక్కువగానే ఉన్నా, ఇప్పుడా స్థానానికి దగ్గరగా కరీంనగర్, జోగులాంబ గద్వాల జిల్లాలు చేరుతున్నాయి.
వామ్మో! ఆ విమానం రెండు సార్లు లక్కీ - గంటల వ్యవధిలో తృటిలో ఎస్కేప్ - రాంచీ ఎయిర్ పోర్టులో..
జిల్లాల వారీగా ఇదీ సీన్..
హైదరాబాద్ లో కొత్తగా వచ్చిన 463తో కలిపి మొత్తం కేసుల సంఖ్య 42,142కు పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 139(మొత్తం6728), మేడ్చల్ 141(మొత్తం4232), సంగారెడ్డి 49(మొత్తం1986) కేసులు నమోదయ్యాయి. సిటీని ఆనుకుని ఉండే ఈ మూడు జిల్లాల్లో తొలి నుంచి ఎఫెక్ట్ కొనసాగుతుండగా, ఇప్పుడు కరీంనగర్ లో కొత్తగా 96 కేసులు, జోగులాంబ గద్వాలలో 78, వరంగల్ అర్బన్ 71, పెద్దపల్లి 71, భద్రాద్రి కొత్తగూడెం 64, కామారెడ్డి 62, నల్గొండ 59, నిజామాబాద్ 58, సిద్దిపేట జిల్లాలో 55 కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా ఖతం?
కరోనాకు సంబంధించి ఎక్కడా లేని విధంగా తెలంగాణ వైద్య శాఖ అధికారులు అనూహ్య ప్రకటన చేశారు. మహమ్మారి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆగస్టు నెలాఖరుకు, మిగతాచోట్ల సెప్టెంబర్ చివరినాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. వైరస్ కట్టడి, చికిత్స కోసం సర్కారు రూ.100 కోట్లు కేటాయించిందని, 11వందల కొవిడ్ సెంటర్లలో రోజుకు 23వేల మందికి టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులపై వస్తోన్న ఫిర్యాదుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్న ఆయన.. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని స్పష్టం చేశారు.