తెలంగాణలో కరోనా: గ్రేటర్లో అదే సీన్ -కొత్తగా 351 కేసులు, 2మరణాలు -వచ్చేవారమే వ్యాక్సినేషన్
తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కొత్త కేసులు, రికవరీల్లో భారీ మార్పులు లేకుండా స్థిరంగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దేశమంతటితో కలిపే రాష్ట్రాంలోనూ వచ్చే వారమే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం.. నిన్న రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 37,451 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కి చేరింది.
తెలంగాణలో కరోనా మరణాలు తొలి నుంచి తక్కువ స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. గడిచిన నెలరోజుల వ్యవధిలో మరణాల సంఖ్య నిత్యం నాలుగు లోపే ఉంటోంది. శనివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా చనిపోయివారి సంఖ్య 1,565కు పెరిగింది. ఇక..
రాష్ట్రంలో కరోనాబారి నుంచి శనివారం ఒక్కరోజే 415 మంది కోలుకున్నారు. తద్వారా రికవరీల సంఖ్య 2,89,784కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,756గా ఉంది. అందులో 2,584 మంది హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 72,53,236 నమూనాలను పరీక్షించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 చొప్పున ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కేంద్రం ప్రకటించిన దరిమిలా పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.