తెలంగాణలో కరోనా: ఐసీయూ బెడ్లు ఫుల్ -ఒక్కరోజే 52 మంది మృతి -కొత్తగా 6,026 కేసులు -గ్రేటర్లో వైరస్ జోరు
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణలో కొవిడ్ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నందున పూర్తి లాక్ డౌన్ అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కండిషన్ కేసులు పెరగడంతో దాదాపు ఐసీయూ బెడ్లన్నీ నిండుకున్నాయి..
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 79,824 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4, 75, 748కి పెరిగింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,115, మేడ్చల్ మల్కాజ్గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు, నల్గొండ జిల్లాలో 368, సంగారెడ్డి జిల్లాలో 235 కొత్త కేసులు వచ్చాయి.
కరోనా మహమ్మారి కాటుకు నిన్న ఒక్కరోజే మరో 52 మంది బలైపోయారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు చనిపోయినవారి వారి సంఖ్య 2,579కి పెరిగింది. కరోనా మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.1కాగా, తెలంగాణలో అది 0.54శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక నిన్న ఒక్క రోజే 6,551 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3,96, 042కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 83.24గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా,
యాక్టివ్ కేసులు భారీగా పెరగడం, అందులోనూ చాలా కేసులు క్రిటికల్ గా మారడంతో హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయిన పరిస్థితి. గాంధీతోపాటు టిమ్స్, కింగ్కోఠి, చెస్ట్ హాస్పిటల్, ఈఎస్ఐ, నిమ్స్, రైల్వే ఆసుపత్రి... ఇలా అన్నింటిలోనూ బెడ్స్ నిండాయని, ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలను కూడా వెంటిలేటర్ బెడ్లుగా మార్చడంతో కొన్ని ఖాళీలు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
Recommended Video