కేసీఆర్ కు కరోనా - ఇష్యూలో భారీ ట్విస్ట్.. తెల్లారుజామున పోలీస్ యాక్షన్.. కిడ్నాప్ ఆరోపణలు..
#WhereisKcr ఈ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా సోకిన దరిమిలా, కేసీఆర్ కూడా వైరస్ కాటుకు గురయ్యారని, గత నెలలో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో ఆయనకు కరోనా అంటుకుందంటూ ఓ లోకల్ పత్రికలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ రాష్ట్రమంతటా సర్క్యూలేట్ అయ్యాయి. గడిచిన రెండు రోజులుగా దీనిపైనే చర్చ కొనసాగుతున్నది. గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వంగానీ, టీఆర్ఎస్ పార్టీగానీ అధికాక ప్రకటన చేయలేదు. అంతలోనే ఈ ఇష్యూలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.
కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?
రంగంలోకి పోలీసులు..
సీఎం కేసీఆర్ కు కరోనా పేరుతో రెండ్రోజుల కిందట ‘ఆదాబ్ హైదరాబాద్' అనే స్థానిక పత్రికలో ప్రచురితమైన వార్త సంచలనంగా మారింది. ఆ పత్రిక క్లిప్పింగ్ వాట్సాప్ గ్రూపుల్లోనూ విపరీతంగా షేర్ అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. పత్రిక ఎడిటర్ ఆనం చిన్ని వెంకటేశ్వర రావును సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు.
కిడ్నాప్ భయంతో కంగారు..
చిన్న పత్రికే అయినప్పటికీ, సంచలనాత్మక కథనాలతో ‘ఆదాబ్ హైదరాబాద్' పాపులారిటీ సాధించింది. కథనాల విషయంలో ఎడిటర్ వెంకటేశ్వరావు వృత్తిపరమైన సవాళ్లనూ ఎదుర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం ఖమ్మంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన ఎంతకీ తిరిగిరాకపోవడం, ఎవరో వ్యక్తులు ఆయనను కారులో ఎక్కించుకెళ్లారని తెలియడంతో కుటుంబీకులు కంగారు పడ్డారు. కిడ్నాప్ ఆరోపణలపై కేసు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారని, ఆలోపే ఆయనను తీసుకెళ్లింది పోలీసులేనని నిర్ధారణ కావడంతో కుటుంబీకులు వెనక్కి తగ్గారని స్థానిక మీడియాలో రిపోర్టులు వచ్చాయి.
టీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదుతో..
కేసీఆర్ కు కరోనా అంటూ ‘ఆదాబ్ హైదరాబాద్' పత్రిక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సంచలనం రేపడం తెలిసిందే. దాన్ని చూసి.. రహమత్ నగర్(హైదరాబాద్)కు చెందిన మహ్మద్ ఇలియాజ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త కూడా షాకయ్యాడు. తనకు తెలిసినవాళ్లను వాకబు చేసి, సదరు వార్త తప్పుడు సమాచారంతో కూడుకున్నదని నిర్ధారించుకున్నాడు. కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రయత్నం చేశారంటూ.. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యం పై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పత్రిక ఎడిటర్ వెంకటేశ్వరావుతోపాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో ఏం తేలిందంటే..
నిజానికి కేసీఆర్ కు కరోనా వార్త ఎలా పుట్టిందనేదానిపై ఒకింత గందరగోళం నెలకొంది. ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ ‘పీటీఐ'.. తెలంగాణలో ఓ మంత్రికి కరోనా అంటూ మహమూద్ అలీ పేరు రాయకుండా వదిలిన వార్తను.. అదే శీర్షికతో ‘లైవ్ మింట్'అనే వెబ్ సైట్ జూన్ 29న ఓ కథనాన్ని ప్రచురించింది. డిప్యూటీ సీఎం ఫొటోకు బదులుగా సీఎం కేసీఆర్ ఫొటోను వాడటంతో కన్ఫ్యూజన్ మొదలైంది. కాగా, జూబ్లీ హిల్స్ పోలీసుల విచారణలో.. ఆ వార్త రాసింది తాను కాదని ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ వెంకటేశ్వరావు చెప్పారని, దీంతో రాసిన వ్యక్తి కోసం గాలింపు చర్య చేపట్టారని ప్రముఖ తెలుగు చానెళ్లలో వార్తలు వచ్చాయి. ‘‘నేను సేఫ్ గా ఉన్నాను, తప్పుడు వార్త రాయలేదని పోలీసులకు చెప్పాను. మీరెవరూ హైదరాబాద్ రావొద్దు.. నేనే వచ్చేస్తున్నా..''అంటూ వెంకటేశ్వరావు తన స్నేహితులతో మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అయింది.
అందుకే ప్రకటన రాలేదా?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నేతలందరూ #WhereisKcr అంశంపై మాట్లాడారు. గందరగోళాన్ని నివారించడానికైనా ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు కోరుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంత మాత్రాన.. అసలు ఏమీ జరగని దానికి అధికారిక ప్రకటన ఎందుకనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు వాదన వినిపిస్తోంది. కాగా, కొవిడ్-19కు సంబంధించి ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ' వ్యవస్థ సైతం కేసీఆర్ కు కొవిడ్ పుకార్లను ఖండించకపోవడంతో నెటిజన్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారు.