పుట్ట బద్దలు: అత్యంత ప్రమాదకర తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్: ఏపీ వాటా ఎక్కువే: ఆందోళనగా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదట్లో తక్కువగా కేసులు నమోదైన ఈ తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్లతో పోటీ పడుతోంది. రోజూ నమోదవుతోన్న పాజిటివ్ కేసులు వందల సంఖ్యల్లోనే ఉంటున్నాయి. తరచూ నాలుగంకెలను కూడా దాటేస్తున్నాయి. మరణాల రేటూ అదే స్థాయిలో ఉంటోంది. రికవరీ శాతం నామమాత్రంగా మారింది. నెలరోజుల్లోనే తెలంగాణ ఈ పరిస్థితికి చేరుకోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
ఏపీలో త్వరలోనే స్కూల్స్ .. డిగ్రీ,పీజీ పరీక్షలపై కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం: మంత్రి సురేష్
తొలి 10 రాష్ట్రాల్లో..
తెలంగాణ వల్ల అత్యంత ప్రమాదకరంగా మారిన తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా దీనికి సంబంధించిన వివరాలను జారీ చేసింది. కరోనా వైరస్ వల్ల అత్యంత దారుణంగా మారిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోన్నట్లు వెల్లడించింది. కిందటి నెల 27వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో నమోదవుతోన్న రోజువారీ పాజిటివ్ కేసులు, మరణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటోన్న పేషెంట్ల వివరాల ఆధారంగా ఓ జాబితాను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.
నెలరోజుల వ్యవధిలో..
కిందటి నెల 27వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను అధ్యయనం చేసిన తరువాత ఈ జాబితాను రూపొందించింది. కరోనా వల్ల అత్యంత ప్రమాదకరంగా మారిన తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మిగిలిన స్థానాలను ఆక్రమించాయి. ఈ 10 రాష్ట్రాల్లోనూ కరోనా వల్ల పరిస్థితులు అధ్వాన్నంగా మారినట్లు కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో 59.5 శాతం..
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల 59.5 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 40.5 శాతం ఉంటోంది. తమిళనాడు-43.3, మహారాష్ట్ర-43.1, హర్యానా-36.1, ఢిల్లీ-35.8, ఉత్తర ప్రదేశ్-32.1, పశ్చిమ బెంగాల్-31.1, గుజరాత్-20.9, రాజస్థాన్-19.3, మధ్యప్రదేశ్-19.1 శాతం మేర కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లల్లో మరణాల రేటు ఈ మిగిలిన ఏడు రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధికంగా ఉంటున్నాయి.
ఎనిమిది రాష్ట్రాల ద్వారా 85.5 శాతం యాక్టివ్ కేసులు
దీనితోపాటు- దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చినవే. దేశవ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసుల్లో ఈ ఎనిమిది రాష్ట్రాల వాటా 85.5 శాతంగా నమోదైంది. అలాగే 87 శాతం మేర మరణాలు ఈ రాష్ట్రాల్లోనే రికార్డు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఏపీ, పశ్చిమ బెంగాల్లల్లో పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.
వేకప్ తెలంగాణ..
ఈ జాబితా విడుదలైన కొద్ది సేపటికే తెలంగాణ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. WakeUpTelanganaGovt పేరుతో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. దేశంలోనే అతి తక్కువగా కరోనా వైద్య పరీక్షలను నిర్వహించిన తెలంగాణలో.. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉందని, ముందుచూపుతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. ముందుజాగ్రత్తలను తీసుకోకపోతే.. కరోనా ఉధృతి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.