రాజ్ భవన్ సిబ్బందికి కరోనా.. గవర్నర్ తమిళిసైకి నెగటివ్.. రెడ్ జోన్ వాసులకు స్పెషల్ రిక్వెస్ట్..
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారంటై మొన్నటిదాకా ప్రచారం సాగడం, ఆ సమయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాక్టివ్ గా పని చేయడం, ఒక దశలో తెలంగాణలో కేంద్రం పాలన విధింపుపైనా పెద్ద ఎత్తున చర్చ జరగడం... అంతలోనే 13రోజుల గ్యాప్ తర్వాత కేసీఆర్ ప్రగతిభవన్ లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో యాక్టివ్ గా పని చేసిన రాజ్ భవన్ లోకే ఇప్పుడు వైరస్ ప్రవేశించింది.
ఎంపీ రఘురామ బాటలో ఎమ్మెల్యే ఆనం?.. వైసీపీలో సెల్ఫీ కలకలం.. సింహపురి ఎక్స్ప్రెస్ కొత్త ఎత్తులు..
హైదరాబాద్ సోమాజిగూడలోని తెలంగాణ రాజ్ భవన్ కు చెందిన 10 మంది సిబ్బందికి కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లలో గన్ మెన్లు కూడా ఉండటంతో భవన్ లోని అందరికీ కరోనా టెస్ట్ లను నిర్వహించారు. రాజ్ భవన్ సిబ్బందితోపాటు వాళ్ల కుటుంబీకులకు కూడా పరీక్షలుచేశారు. తన టెస్టుల ఫలితాలను గవర్నర్ తమిళిసై స్వయంగా వెల్లడించారు.
''ఈ రోజు కోవిడ్ పరీక్షలు చేయించుకుననాను. నెగటివ్ అని తేలింది. ఈ సందర్భంగా నాదొక విన్నపం.. రెడ్ జోన్లో ఉన్నవాళ్లందరూ, వారితో కాంటాక్ట్లో ఉన్న ఇతరులు కూడా దయచేసి ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తుగా చేయించుకునే నిర్దారణ పరీక్షలు చేయించుకుంటే మనతోపాటు ఇతరులనూ కాపాడినట్లవుతుంది. కరోనా విషయంలో '4టీ' (టెస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్)ను అందరం ఫాలో అవుదాం..''అని గవర్నర్ ట్విటర్ లో పేర్కొన్నారు.
Recommended Video
రాష్ట్రంలో రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త కేసుల నమోదు భారీగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తున్నది. శనివారం ఒక్కరోజే 1178 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు పెరిగింది. ఇందులో 348 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 21వేల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12వేలుగా ఉంది. కొత్త కేసుల భయంతో చాలా ప్రాంతాల్లో సెల్ఫ్ క్వారంటైన్ ప్రకటనలు వెలువడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో సోమవారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ పాటిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, ఖమ్మం ఇతర జిల్లాల్లోనూ వ్యాపారవర్గాలు సెల్ఫ్ లాక్ డౌన్లకు మళ్లుతుండటం గమనార్హం.