తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్మెన్ మృతి..
తెలుగురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రెండు చోట్లా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది దాకా వైరస్ ఎవరినీ వదలడంలేదు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా కాటుకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే గన్ మెన్ కొవిడ్-19 కారణంగా ప్రాణాలే కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..
బాజిరెడ్డి గోవర్ధన్ కు పాజిటివ్..
రెండురోజుల కిందటే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా కాటుకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది. ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య, ఇంట్లో పనివాళ్లకు సైతం వైరస్ సోకింది. అయితే, ఎమ్మెల్యే దంపతులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడం.. పనివాళ్లను మాత్రం గాంధీ ఆస్పత్రికి తరలించడం వివాదాస్పదమైంది. ఈలోపే అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకూ కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్కు కరోనా పాజిటివ్ అని వైద్యులు ఆదివారం నిర్ధారించారు.
వైరస్ తోనే అధికారిక కార్యక్రమాల్లో..
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజానికి 3 రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయినాసరే లెక్కచేయకుండా ఆయన శనివారం నాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. చివరికి ఆదివారం నాటి పరీక్షల్లో ఎమ్మెల్యేకు వైరస్ ఉందని తేలడంతో అందరూ షాకయ్యారు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే చికిత్స కోసం ఎమ్మెల్యే హైదరాబాద్కు బయలుదేరారు. ఆయనతోపాటు కుటుంబీకులు, అధికారిక కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బందిని ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. మరోవైపు..
వైసీపీ ఎమ్మెల్యే గన్ మెన్ మృతి
ఏపీలో ఆదివారం నాటికి కొత్తగా 294 మందికి వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 6152కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 84కు చేరింది. చనిపోయినవాళ్లలో అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్ మెన్ కూడా ఒకరు. కొవిడ్-19 టెస్టుల విషయంలో దేశంలోనే బెస్ట్ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఎమ్మెల్యే గన్ మెన్ మాత్రం టెస్టు చేయించుకోకుండా మరణాన్ని కొనితెచ్చుకోవడం విషాదంగా మారింది.
దయచేసి అలా చేయొద్దు..
తన గన్ మెన్ సురేశ్ కొవిడ్ వ్యాధితో చనిపోయిన విషయాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే.. ఒకవేళ పాజిటివ్ అని తేలితే తనను చులకనగా చూస్తారనే భావనతో సురేశ్ టెస్టులు చేయించుకోలేదని ఎమ్మెల్యే వివరించారు. దయచేసి సురేశ్ లాగా ఎవరూ చేయొద్దని, కరోనా విషయంలో ఎవరైనాసరే మొహమాటాలకు పోవద్దని, రోగుల పట్ల చులకన భావం ప్రదర్శించొద్దని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. కాగా, ధర్మవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.
Recommended Video
మోదీ దిగ్భ్రాంతి.. లోకేశ్ సానుభూతి.. సుశాంత్ మరణం నేపథ్యంలో సంచలన రిపోర్ట్.. హెల్ప్ లైన్లు..