ఆ ప్రశ్నను బీజేపీ పైకి గురిపెట్టిన కేటీఆర్... అదిరిపోయే కౌంటర్...
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నను బీజేపీ పైకి గురిపెట్టారు. 'జనంలో బాగానే తిరుగుతున్నారు... అయినప్పటికీ సేఫ్గా ఉన్నారు... భారత్ బయోటెక్ను సందర్శించినప్పుడు కోవ్యాక్సిన్ ఏమైనా తీసుకున్నారా... లేక మరేదైనా కారణం ఉందా..' అని ఓ నెటిజన్ ట్విట్టర్లో కేటీఆర్ను ప్రశ్నించాడు. దీనికి కేటీఆర్.. 'అలాంటిదేమీ లేదు.. కోవిడ్ వ్యాక్సిన్ ఏదీ తీసుకోలేదు. నాకు తెలిసినంతవరకు ఇప్పటికైతే దాన్ని బీహార్ కోసం రిజర్వ్ చేసి పెట్టారు.' అని కేటీఆర్ వ్యంగ్యంగా బదులిచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ 'ఫ్రీ కరోనా వ్యాక్సిన్' హామీని చేర్చడం వివాదాస్పదంగా మారిన తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ను ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రాజకీయం చేయడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ అందించాల్సిన వ్యాక్సిన్ను ఎన్నికలు,ఓట్లకు ముడిపెట్టడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నను బీజేపీ మీద వ్యంగ్యాస్త్రంగా సంధించారు. కేటీఆర్ ట్వీట్కు నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.
కాగా,ఈ ఏడాది అగస్టులో కేటీఆర్ భారత్ బయోటెక్ను సందర్శించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ నుంచే దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఆ సందర్భంగా కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సదరు నెటిజన్ మంత్రి కేటీఆర్ను 'భారత్ బయోటెక్ను సందర్శించినప్పుడు కోవ్యాక్సిన్ ఏమైనా తీసుకున్నారా...' అని ప్రశ్నించారు. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు గురువారమే(అక్టోబర్ 22) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రావడం విశేషం. మూడో దశ ప్రయోగాల కోసం భారత్ బయోటెక్ అక్టోబర్ 2న డీసీజీఐకి దరఖాస్తు చేసుకోగా... తాజాగా ఇందుకు అనుమతులు జారీ అయ్యాయి.
Nope. Didn’t get any COVID vaccine shot; apparently it’s reserved only for Bihar😅 https://t.co/uR1QpCMzYj
— KTR (@KTRTRS) October 22, 2020