కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు .. సమయం వచ్చినప్పుడు బయటపెడతా .. జగ్గారెడ్డి సంచలనం
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. మొన్నటికి మొన్న యూపీఏ కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చెయ్యటానికి కేసీఆర్, జగన్ లు కూడా మద్దతు ఇస్తారని, వారు తమకు టచ్ లోనే ఉన్నారని సంచలన వ్యాఖ్య చేశారు . ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని మరో వ్యాఖ్య చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా?.. ఆరు నెలలా, రెండేళ్లా.. కాంగ్రెస్ నేతల మర్మమేంటి?
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారు.. సమయం వచ్చినప్పుడు చెప్తానన్న జగ్గారెడ్డి
అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలు మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును నిలువునా తీస్తున్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో నేతలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని చెప్పిన జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ ఇన్ చార్జి కుంతియాలు అమ్ముడుపోయారన్నది సరికాదన్నారు. వీళ్లిద్దరినీ ఎవ్వరూ కొనలేరని తేల్చిచెప్పారు.
డబ్బు కోసం, పదవుల కోసం కాక పార్టీ కోసం పని చేసే వారి గురించి రాహుల్ కు లేఖ రాస్తానన్న జగ్గా రెడ్డి
పదవులు, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో పుష్కలంగా ఉన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ గా పని చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం పనిచేసే నేత అని కితాబిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే నేతల గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి తాను ఒక లేఖ రాస్తానని జగ్గారెడ్డి చెప్పారు.
ఉత్తమ్ పై విమర్శలు తిప్పి కొట్టిన జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ పార్టీ ఎదుగుదల, పటిష్టత కోసం పనిచేశారని జగ్గారెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఉత్తమ్ పనిచేశారనడం సరికాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు . పార్టీ కేడర్ లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారని అభిప్రాయపడ్డారు. పీసీసీతో పాటు పార్టీలో సీనియర్ నేతలు సమన్వయంతో పనిచేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తుందని తెలిపారు జగ్గా రెడ్డి.