'కేసీఆర్! చరిత్ర తెలుసుకో, నిజాంది రాక్షస పాలన'
హైదరాబాద్: పదేపదే నిజాం రాజును పొగుడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాకట్టు పెడుతున్నారని, నిజాంది రాక్షస పాలన అని, కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి శనివారం మండిపడ్డారు.
నిజాం నవాబు చేసిన అరాచకులు, అణిచివేతలు, హింస కారణంగా 4500 మంది కమ్యూనిస్టులు మృతి చెందారని చెప్పారు. చరిత్రను తెలుసుకోకుండా కేసీఆర్ మాట్లాడటం తగదన్నారు. బానిసత్వం, అరాచకత్వానికి నిజాం రాక్షస పాలన నిదర్శనమని, అలాంటి నిజాంను పొగుడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తక్కువచేసి చూపాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.
అందుకే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదన్నారు. కేవలం ముస్లీం ఓట్ల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎంసెట్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య రోజు రోజుకూ తీవ్రమవుతుంటే పునర్విభజన చట్టం ప్రకారం ఎవరు నిర్వహించాలనేది చెప్పాల్సిన కేంద్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్నారు.
రైతుల సంక్షేమానికే హెరిటేజ్: లోకేశ్
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తన తండ్రి చంద్రబాబు నాయుడు 1992లో హెరిటేజ్ పాల పరిశ్రమకు చిత్తూరులో శ్రీకారం చుట్టారని ఆ సంస్థ డైరెక్టర్, టీడీపీ యువనేత నారా లోకేశ్ వెల్లడించారు. ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ పరిశ్రమలో జాతీయ ఇంధన పొదుపు అవార్డును సంస్థ చైర్పర్సన్ నారా భువనేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణితో కలసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
ఏటా తమ సంస్థద్వారా రైతులకు రూ.7-8 కోట్లవరకు ఆదాయం చేకూరుస్తున్నదని ఆయన తెలిపారు. రైతు సంక్షేమ ట్రస్ట్ద్వారా పాలు సరఫరా చేసే రైతులందరికీ ప్రమాద బీమా కల్పించడంతోపాటు వారి పాడి పశువులకు గ్రాసం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప్పల్లోని 2 లక్షల లీటర్ల సామర్థ్యంగల యూనిట్లో 500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వీరంతా ఎంతగానో చేసిన కృషి ఫలించి, జాతీయ ఇంధన పొదుపు అవార్డును సాధించారన్నారు.