అడకత్తెరలో సీపీఐ .. టీఆర్ఎస్ కు హుజూర్ నగర్ లో సపోర్ట్ , ఆర్టీసీ కార్మికుల కోసం ఫైట్
తెలంగాణా రాష్ట్రంలో సీపీఐ తాజా పరిణామాల నేపధ్యంలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఆత్మ పరిశీలనలో పడ్డారు. అధికార పార్టీకి మద్దతు ఇచ్చి తప్పు చేశామా అనే ఆలోచనలో ఉన్న నేతలు ఆర్టీసీ కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక హుజూర్ నగర్ ఎన్నికల్లో మద్దతు రాజకీయ అవసరం అని పేర్కొని దానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముడి పెట్టొద్దని క్లారిటీ ఇస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ప్రకటిస్తున్నామన్న సీపీఐ
ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదని ఆయన అన్నారు. మరోపక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సిపిఐ. ప్రస్తుత పరిస్థితుల్లో హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడాన్ని, ఆర్టీసీ కార్మకుల సమ్మెతో ముడిపెట్టవద్దని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు.
ఒకపక్క ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూనే మరోపక్క మద్దతా ?
ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒకపక్క ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నే, మరోపక్క హుజూర్ నగర్ లో అధికారపార్టీకి సిపిఐ మద్దతు ఇవ్వడాన్ని ప్రజా సంఘాలు తప్పు పడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి మద్దతనేది రాజకీయపరమైన నిర్ణయమని తెలిపారు చాడా వెంకటరెడ్డి. హుజరాబాద్ ఎన్నికల వ్యవహారాన్ని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏమాత్రం లింకు చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆర్టీసీ కార్మకుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందని చెప్పిన చాడా వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు.
కార్మికుల పక్షాన సీపీఐ పోరాటం చేస్తుందన్న సీపీఐ నేత చాడా వెంకట రెడ్డి
కేసీఆర్ మొండి వైఖరిని వీడాలని, సరైన దిశగా ఆలోచించాలని సూచించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, అందువల్ల ఇక్కడి ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారని అందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. వారి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి సూచించారు . కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. కార్మికుల పక్షాన తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ నేత చాడ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.
తాజా పరిణామాలతో ఇబ్బందికరంగా మారిన సీపీఐ పరిస్థితి
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ సిపిఐ పార్టీ నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇక ఏది ఏమైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐకి ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ పై పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో అధికార పార్టీ పై పోరాటం చేస్తూ, హుజూర్ నగర్ ఎన్నికల విషయంలో అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే సీపీఐకి ఒకింత ఇబ్బందికరమైన విషయమే. కాబట్టి తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బెట్టు వీడకుంటే సిపిఐ ఏం చేస్తుంది అనేది ఆసక్తికరమైన విషయం.