సమ్మె: 'వాళ్లేమీ టెర్రరిస్టులు కారు', 'వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు'
హైదరాబాద్: గత పది రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారిని పట్టించుకోకపోగా వారి సమ్మెను పోలీసుల సాయంతో భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సీపీఎం నేత బివి రాఘవులు స్పందించారు. పోలీలుసు, సైన్యాన్ని దించి అణచివేయడానికి పారశుధ్య కార్మికులు టెర్రరిస్టులు కాదని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులు పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని అన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణలో ముఖ్య భూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు గౌరవ వేతనం ఇవ్వాలనే డిమాండ్ సరైందేనని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక పారిశుధ్య కార్మికుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు సిధ్దంగా ఉంటారని సీపీఎం తెలంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు ఇందిరాపార్క వద్ద చేప్పటిన రిలే నిరహర దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కార్మికుల చేత వెట్టి చారికి చేయించుకుంటూ కనీస అవసరాలు తీర్చడం లేదని మండిపడ్డారు.
గురువారం నుంచి మూడు రోజుల్లో కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక నిరాహార దీక్షకైనా వెనుకాడబోమని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. మనం పట్టుదలతో ముందుకు వెళ్లితే ప్రభుత్వమే దిగొస్తుందని కార్మికులకు తమ్మినేని పిలుపునిచ్చారు.
పారిశుధ్య కార్మికుల సమ్మెకి కాంగ్రెస్ మధ్దతు
గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు సరైనవేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మూడు రోజుల్లో వారి డిమాండ్లు పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.