ఏదీ ఆత్మగౌరవ పాలన!, కుట్రల చేస్తున్నారు: చాడ వెంకట్రెడ్డి ఫైర్
కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని, తెలంగాణలో ఆత్మగౌరవ పాలన ఏదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు.
వరంగల్: కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని, తెలంగాణలో ఆత్మగౌరవ పాలన ఏదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో మంగళవారం సీపీఐ మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు ముగింపు సమావేశానికి ఆయన హాజరయ్యారు.
అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను అణిచివేతకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలకు తృప్తి లేదన్నారు.
ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం బోగస్ సర్వేలు చేయించి గ్లోబల్ ప్రచారంతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. సర్వేలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. తెలంగాణలో జీవోలు, చట్టాలు లేవని, కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ మియాపూర్లో రూ.10 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది రైతులు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకుంటే కేవలం 50 వేల వాటిని పరిష్కరించారన్నారు. 22 లక్షల మందికి రెండు పడకల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మూడేళ్లలో 1200 ఇళ్లు మాత్రమే నిర్మించారన్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణ తెరాస పాలనలో రూ.1.48 వేల కోట్ల అప్పుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా పార్కు, తాడిచెర్ల, ప్రాజెక్టుల సాధన కోసం అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయడంలో సీపీఐ ముందుందన్నారు. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ అధ్యక్షులు ఆదరి శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్రావు, మాజీ ఎమ్మెల్యే సారయ్య, జిల్లా కార్యదర్శి కరుణాకర్, సహాయ కార్యదర్శులు బిక్షపతి, ప్రసాద్తోపాటు పలువురు పాల్గొన్నారు.