దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఒకే... ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నా....
దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్ పై సిపిఐ జాతియ నేత నారాయణ మాటమార్చారు. దిశ ఎన్కౌంటర్ తర్వాత చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే అంతకు ముందు జరిగిన పరిణామాలపై నారయణ హర్షం వ్యక్తం చేశారు. నిందితుల ఎన్కౌంటర్ను ఆయన సమర్ధించారు. కాని జాతీయ పార్టీ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్న నారాయణ ఎన్కౌంటర్లను సమర్ధించడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో నారాయణ ఎన్కౌంటర్పై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
దిశ సంఘటనతో పోలీసులపై ఒత్తిడి
దిశ అత్యాచారం, హత్య జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా అనేక అందోళనలు చెలరేగాయి. దీంతో నిందితులను వెంటనే ఉరి తీయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు లేవనెత్తారు. పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను తమకు అప్పగించాలని పోలీసుస్టేషన్ను సైతం ముట్టడించిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. మొత్తం మీద నిందితులు ఎన్కౌంటర్కు గురయ్యారు.
ఎన్కౌంటర్ను సమర్ధించిన ప్రజలు వ్యతిరేకించిన మేధావులు
అయితే జరిగిన ఎన్కౌంటర్పై ప్రజలు పెద్దఎత్తున హర్షద్వానాలు వ్యక్తం అయ్యాయి. ఒకదశలో సంఘటన స్థలంలో పోలీసులపై ప్రజలు పూల వర్షం కురించారు. దీంతో పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించారు. పోలీసులను అభినందిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ నారయణ సైతం ఎన్కౌంటర్ను సమర్థిస్తూ... వ్యాఖ్యలు చేశారు. నిందితులకు సరైన శిక్ష పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దేశంలోని కొంతమంది మేధావులు, మానవ హక్కుల సంఘం నేతలు ఈ సంఘటనను చట్టం కోణంలో పరిశీలించారు. నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వ్యతిరేకించిన సీపీఐ జాతీయ కార్యవర్గం
ఈనేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ఉన్న సీపీఐ ఎన్కౌంటర్ను ఖండించింది. పార్లమెంట్లో సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలు తప్పుబట్టారు. దీంతో నారాయణ సైతం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. ఆయన చేసిన ప్రకటనపై ప్రజలకు, పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఉన్నాయనే ఆలోచనతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు నారయణ చెప్పారు.