గడ్చిరోలి పేలుడు సూత్రధారి శ్రీకాకుళం వాసి: వరంగల్ ఆర్ఈసీ విద్యార్థి కూడా!
ముంబై/అమరావతి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకున్న మావోయిస్టుల దాడి వెనుక అసలు సూత్రధారి మావోయిస్టు మాస్టర్ మైండ్ ఎవరో తేలిపోయింది. సీపీఐ (మావోయిస్టు) గ్రూప్ చీఫ్ నంబల కేశవరావు అలియాస్ గుర్రె బసవరాజు హస్తం ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావోయిస్టు) కేంద్ర మిలటరీ కమాండర్ పదవి నుంచి తప్పుకొన్న తరువాత ఆ స్థానాన్ని నంబల కేశవరావు భర్తీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ లోనే కేశవరావు మావోయిస్టు గ్రూప్ చీఫ్ గా ఎన్నికయ్యాడు.
తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సుపరిచితుడు నంబల కేశవరావు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తెలంగాణలోని వరంగల్ లో ఉన్న రీజనల్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి. శ్రీకాకుళం ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో సీటు లభించింది. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే అతను ఒకప్పటి పీపుల్స్ వార్ వైపు కార్యక్రమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అంతకుముందు- ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో క్రియాశీలకంగా పని చేసే సమయంలో ఓ సారి అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై విడుదలైన తరువాత నక్సల్స్ గ్రూపులో చేరాడు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలను కొనసాగించాడు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సీపీఐ (ఎంఎల్) పీపుల్స్వార్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యాడు. ఎంటెక్ మధ్యలోనే వదిలేసి ఉద్యమంలో చేరారు. 34 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు.
నడిపిస్తోంది కేశవరావే..
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన అనంతరం.. కేశవరావు నియమితులయ్యాడు. అప్పటి నుంచీ మావోయిస్టులు క్రియాశీలకంగా మారారని అంటున్నారు పోలీసులు. కేశవరావు బాధ్యతలను స్వీకరించిన తరువాత మావోయిస్టులు పెద్ద ఎత్తున సచేతులయ్యారని తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యాకాండ వెనుక కూడా కేశవరావు స్కెచ్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనితో పాటు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే హత్యోదంతం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కేశవరావేనని తెలుస్తోంది.
వ్యూహం పన్ని..దాడి!
గడ్చిరోలిలోపి కుర్ ఖేడా-జముర్ ఖేడా గ్రామాల మధ్య అత్యంత శక్తిమంతమైన ఐఈడీ అమర్చిన మందుపాతరను పేల్చేయడం ద్వారా 16 మందిని మావోయిస్టులు పొట్టన బెట్టుకున్న ఘటనలో కేశవరావు పక్కా స్కెచ్ ఉందని మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. కుర్ ఖేడా వద్ద రోడ్డు నిర్మాణంలో వినియోగించే వాహనాలను దహనం చేయడం వల్ల పోలీసుల పెద్ద సంఖ్యలో సంఘటనాస్థలానికి చేరుకుంటారని, అలా వచ్చిన వారిని అంతం చేయాలని వ్యూహం పన్నారు. వల విసిరారు. మావోయిస్టుల అంచనా ప్రకారం- పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్తూ మార్గమధ్యలో మందుపాతరకు బలయ్యారు. నిజానికి- మావోయిస్టుల అంచనా భారీగా ఉందని తెలుస్తోంది. పెద్ద ఎత్తున వాహనాలను తగులబెట్టినందున.. అంతే స్థాయిలో పోలీసులు కూడా సంఘటనాస్థలానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ముందుగా ఊహించారు. ఇక్కడే వారి అంచనా తప్పింది.
కేశవరావు తలపై రూ.19 లక్షల రివార్డ్
మావోయిస్టు ప్రధాన కార్యదర్శి పగ్గాలను అందుకున్న తరువాత పోలీసులు, భద్రతా బలగాల కన్ను కేశవరావుపై పడింది. అతని కోసం ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థే రంగంలోకి దిగింది. కేశవరావు తలపై భారీ రివార్డను ప్రకటించింది. కేశవరావు ఆచూకీని తెలియజేసిన వారికి 19 లక్షల రూపాయలను బహుమానంగా ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ముప్పాళ్ల లక్ష్మణరావు కూడా ఉన్నారు. అతని ఆచూకీ తెలియజేసిన వారికి ఎన్ఐఏ 24 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది.