దావూద్ కంటే నయీం ప్రమాదకరం, వాళ్లను పట్టుకోగలరా: సిట్కు నారాయణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం డాన్ దావూద్ ఇబ్రహీం కంటే చాలా ప్రమాదకరమని సిపిఐ నేత నారాయణ ఆదివారం నాడు అన్నారు. నయీం కేసులో చాలా పెద్దవాళ్లు ఉన్నారని అన్నారు. 1996 నుంచి ఉన్న పలువురు డీజీపీలకు, నేతలకు నయీంతే లింక్స్ ఉన్నాయన్నారు.
వారిని పట్టుకునే బలం సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)కు ఉందా అని నిలదీశారు. నయీం కేసులో చిన్న చిన్న వాళ్లను అరెస్టు చేసి కేసు మూసేయాలని భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నయీం ఆక్రమించుకున్న భూములను బాధితులకు ఇవ్వాలని, లేదంటే ఆ భూముల్లో జెండాలు పాతుతామన్నారు.
నయీం మృతి చెందినా..
నయీం మృతి చెందినా ఆయన పేరుతో ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నయీం పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నయీం ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న శేషన్న, నయీం బంధువు ఖలీంలను అడ్డం పెట్టుకుని ఆయన తమను బెదిరిస్తున్నట్టు ఫిర్యాదు చేశారని అంటున్నారు. తన నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల భూలావాదేవీల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని వాపోయారని తెలుస్తోంది.
ప్రస్తుతం శేషన్న, ఖలీంలు అజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం సిట్ గాలిస్తున్న విషయం తెలిసిందే. వారు కనుక దొరికితే ఆ ఎమ్మెల్యే బండారం బయటపడుతుందంటున్నారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదులు అందడంతో నిజానిజాలను నిగ్గుతేల్చి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం సిట్ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది.