'పన్నీరును సీఎంగా చేయాలనుకున్న బీజేపీకి శృంగభంగం'
తమిళనాడులో పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీకి శృంగభంగం అయిందని సిపిఐ సీనియర్ నేత నారాయణ గురువారం నాడు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: తమిళనాడులో పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీకి శృంగభంగం అయిందని సిపిఐ సీనియర్ నేత నారాయణ గురువారం నాడు ఎద్దేవా చేశారు.
తమిళనాడులో ఇప్పటి వరకు ఇంతటి రాజకీయ శూన్యత ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కేంద్రం ఆదేశాలతోనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జాప్యం చేశారని ఆరోపించారు. కేంద్రం తమిళనాడులో ఏదో చేయాలనుకుందని, కానీ అంతా రివర్స్ అయిందని అభిప్రాయపడ్డారు.
'సుబ్రహ్మణ్య స్వామి రాకతో తమిళనాట రాజకీయం ముదిరే అవకాశం'
కాగా, శశికళ పైన పన్నీరు సెల్వం తిరుగుబాటు చేయడానికి బీజేపీ కారణమని చాలా మంది భావిస్తున్నారు. పన్నీరు సెల్వంను సీఎంగా కొనసాగించాలని బీజేపీ భావించింది. అందుకోసం కేంద్రం చక్రం తిప్పిందనే వాదనలు ఉన్నాయి.
అంతేకాదు, స్వయంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా.. పన్నీరు వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని చెప్పారు. కానీ శశికళ అంతకు మించి పావులు కదిపారు.
అయితే ఆ తర్వాత ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. దీంతో తన వ్యూహాన్ని మార్చిన శశికళ.. పళనిస్వామిని సీఎంగా తెరపైకి తెచ్చారు. అందరు ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చారు. ఈ రోజ పళని స్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.