చిగురించక ముందే చిత్తైన స్నేహం..! కారు జోరుకు ఎరుపు జెండా బ్రేక్..!!
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు రంగుమారుతున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పైచేయి సాధించేందుకు ఏకం కావాలనుకున్న పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. అధికార గులాబీ పార్టీపై ఆర్టీసి కార్మికుల సమ్మె దారుణమైన ప్రభావం చూపిస్తోందని, హుజూర్ నగర్ లో దీని మార్క్ పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో గులాబీ పార్టీతో పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకరించి, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పొత్తుపై పునరాలోచిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి చాడా వెంకటరెడ్డి ప్రకటించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
హుజూర్
నగర్
పోరు
..
టీఆర్ఎస్
కు
మద్దతుపై
సీపీఐ
యూటర్న్
బాంబ్
?
టీఆర్ఎస్ తో స్నేహం వద్దు.. పొత్తుపై సీపిఐ కీలక నిర్ణయం..
తెలంగాణలో ఆర్టీసి కార్మికుల అంశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్న విధానాల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసి ఉద్యోగుల కాలుకు ముల్లు దిగితే పంటితో తీస్తామని పదే పదే చెప్పిన చంద్రశేఖర్ రావు వారి పట్ల కఠినంగా వ్యవరించడాన్ని తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసి ఉద్యోగ సంఘాలకు చంద్రశేఖర్ రావు ఇచ్చే గుర్తింపు ఇదేనా అని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. దీంతో కార్మికుల సమ్మె, ఉద్యోగాల నుండి తొలగింపు చర్యలు రాజకీయ రంగును పులుముకున్నాయి. అంతే కాకుండా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ, సీపిఐ పార్టీ మద్య అనూహ్యంగా ఏర్పడ్డ పొత్తు విచ్చిన్నం అయ్యేందుకు కూడా ఆర్టీసి సమ్మె కారణం అవుతోంది.
ఆర్టీసి కార్మికుల సమ్మె.. హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఘోర ప్రభావం..
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార గులాబీ పార్టీతో సీపిఐ పార్టీ పొత్తును అనేక రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు తప్పుబట్టారు. భావసారూప్యతలేని పార్టీల మద్య పొత్తు ఏంటని, సీపిఐ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఎలా నడుచుకుంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఐనప్పటికి సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి టీఆర్ఎస్ పొత్తు అంశంలో చెలరేగిన ఆరోపణలను పట్టించుకోకుండా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో చంద్రశేఖర్ రావుకు మద్దత్తు ఇచ్చేందుకే నిర్ణయించుకున్నారు. ఐతే ఆర్టీసి సమ్మె ప్రభావం చిగురించిన స్నేహాన్ని ఛిన్నా భిన్నం చేసింది.
పొత్తు పై సీపిఐ పునరాలోచన.. సమ్మె విషయంలో మద్దత్తు ఎవరికో తేల్చుకోని సీపీఐ..
దీంతో కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువుకు ఏదో ఐనట్టు వచ్చే వార్తల మాదిరిగా టీఆర్ఎస్, సీపిఐ పార్టీల పొత్తు గురించి చర్చ జరుగుతోంది. స్నేహం చేసిన మూడు నాళ్లకే విడిపోవడం, పెటాకులైన పెళ్లి, ఆదిలోనే హంసపాదు వంటి ఉపమానాలతో ఈ రెండు పార్టీల పొత్తును పోల్చుతున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ ప్రయోజనాల కోసం సిద్దాంతాలను పక్కన పెడితే ఇలాంటి పరిణామాలే ఎదురౌతాయనే చర్చ కూడా జరుగుతోంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశంలో టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న తాత్కాలిక పొత్తు దాదాపు ఉపసంహరించుకున్నట్టేనని సీపిఐ వర్గాలు నిర్దిరిస్తున్నాయి. దీంతో అధికార గులాబీ పార్టీ ఒంటరిగా బరిలో నిలుచునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురువారం స్పష్టత వచ్చే అవకాశం.. దాదాపు పొత్తు లేనట్టే అంటున్న కామ్రేడ్స్..
కాగా ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న సీపీఐ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచనలో పడింది. సీపీఐ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతుండగా, ఒక్క సీపీఐ పార్టీ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. గతవారం హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సమ్మెపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కఠినంగా వ్యవహరిస్తుండడంతో సీపీఐ నాయకులు మద్దతు ఉపసంహారించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. గురువారం నాడు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో మద్దతుపై చర్చించి నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.