కేసీఆర్ ‘కారు’కే మద్దతు తెలిపిన కామ్రేడ్లు!: ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: అంతా ఊహించినట్లే జరిగింది. హుజూర్నగర్కు జరుగుతున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని కోరుతూ.. టీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు ఇటీవల చాడ వెంకట్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా తమకు మద్దతు ఇవ్వాలంటూ సీపీఐని కోరారు.
ఈ క్రమంలో మంగళవారం జరిగిన సమావేశంలో చర్చలు జరిపిన సీపీఐ నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, గత అసెంబ్లీ ఎన్నికల వరకే కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు ఉందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి లేదని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తమను మద్దతు కోసం ముందు సంప్రదించలేదని ఆయన తెలిపారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం కానీ.. మిత్రపక్షంగానే కేసీఆర్ సర్కారు తీసుకునే తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తామని చెప్పారు.
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ప్రచారం కూడా చేస్తుందని సీపీఐ నేత నారాయణ తెలిపారు. మొన్నటి వరకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు కాదా? అని మీడియా ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది ఇలావుంటే, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఈ ఉపఎన్నికలో కామ్రేడ్ల పోటీ లేదనే చెప్పాలి. కాగా, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి డాక్టర్ రామారావు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ ఉన్నారు.