సమ్మె ఎఫెక్ట్: హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సోమవారం సాయంత్రం ప్రకటించారు.
మగ్ధూంభవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమ్మె కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని, దాన్ని నిరాకరించడం అంటే కార్మిక వర్గాన్ని వ్యతిరేకించడమేనని అన్నారు.
చర్చలను నిరాకరిస్తూ దాదాపు 48వేల మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా వారిని రెచ్చగొట్టిందని చాట వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం యత్నించి విఫలమైందని అన్నారు. కొత్త నియామకాల పేరుతో నిరుద్యోగ యువతకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఈ వైఖరి మార్చుకోవాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో కార్మిక, శ్రామిక వర్గ పార్టీగా హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఇచ్చిన తమ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ఇది ఇలావుండగా, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. తాజాగా నియమించిన తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య అంతర్యుద్ధం నడుపుతున్నారని నారాయణ ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులంతా ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇల్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలన్నారు.