తెలంగాణ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ దృష్టి, రెండ్రోజుల్లో కీలక భేటీ
Recommended Video
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలలోను టిక్కెట్లు దక్కుతాయని నమ్మకం ఉన్నవారు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ, కోదండరాం పార్టీల మధ్య పొత్తుల అంశంపై చర్చ సాగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన, సీపీఎం కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే మనం కలిసి పని చేద్దామని సీపీఎం నేతలు జనసేనానికి ప్రతిపాదించారు.
కాగా, జనసేన ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. జనసేన కూడా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ వ్యవహారాల కమిటీతో పవన్ చర్చించారని తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని తెలిపింది. తమ్మినేనితో జరిగిన చర్చల సారాంశాన్ని అధినేతకు వివరించారన్నారు. తదుపరి చర్చలు పవన్ సమక్షంలో జరుగుతాయన్నారు. మంగళ లేదా బుధవారం సీపీఎం నేతలతో చర్చలు జరగనున్నాయని చెప్పారు.
ఇటీవల జనసేన నేతలతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. పవన్ నేతృత్వంలోని జనసేనతో కలిసి పని చేయడానికి సానుకూలంగా చర్చలు సాగాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై జనసేన ప్రతినిధులు, సీపీఎం నేతలు చర్చలు జరిపారు.
జనసేన సిద్ధాంతాలు, సీపీఎం భావాల మధ్య సారూప్యంఉండటంతో చర్చలు సానుకూలంగా సాగాయని జనసేన ప్రతినిధులు తెలిపారు. ఈ చర్చలపై తమ అధినేత పవన్కు నివేదిక సమర్పిస్తామని, ఆయన సీపీఎం నేతలతో భేటీ అయ్యాక పొత్తుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, వ్యూహాలపై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. జిల్లాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే తెరాస హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.