కోదండరాం పార్టీతో పొత్తుకు చర్చలు జరుపుతున్నాం: తమ్మినేని వీరభద్రం
కరీంనగర్: 2019ఎన్నికల్లో తెలంగాణ ఏయే పార్టీలు పొత్తుతో బరిలో దిగుతాయన్న అంశంపై ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే అయినా.. ఇటీవలే ఏర్పడ్డ కోదండరాం తెలంగాణ జనసమితి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లు కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయన్న వాదన లేకపోలేదు.
ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఆసక్తికర ప్రకటన చేశారు. తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పడిన తెలంగాణ సమితి పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సోమవారం ముకుంద లాల్ భవన్లో జరిగిన పార్లమెంటు స్థాయి సమావేశానికి తమ్మినేని, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హాజరయ్యారు. సమావేశంలో కరీంనగర్ సమస్యలతో పాటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి ఎంపికపై కూడా చర్చ జరిపారు.
సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 119 స్థానాల్లో పోటిచేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామిలలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. హామిలే అమలుకానప్పుడు ఇంకెక్కడి బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. 2019లో టీఆర్ఎస్ను ఓడించడమే తమ లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల కూడా తెలంగాణకు ఒరిగిందేమి లేదని, కాబట్టి ఆ పార్టీతోనూ పొత్తులు ఉండవని తమ్మినేని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పరం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించిందని ఆరోపించారు. రైతు బంధు పథకంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించకుండా ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధకం భూస్వాములకు మేలు చేసేందుకేనని అన్నారు.
ఇప్పటికైనా పథకాన్ని సవరించి కౌలు, పోడు రైతులకు సాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని, కేవలం ప్రభుత్వమే ధనికమని ఎద్దేవా చేశారు.