హుజుర్నగర్ ఉప ఎన్నికకు CPM సై.. కానీ, రిటర్నింగ్ అధికారుల షాక్..!
నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీకి జరగబోతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షంతో సై అంటే సై అంటూ కదన రంగంలో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య నేను సైతం అంటూ బీజేపీ కూడా దూరింది. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఈ మూడు పార్టీల మధ్య ముచ్చటగా త్రిముఖ పోటీ నెలకొనగా.. టీడీపీ, సీపీఎం అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అదలావుంటే ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం చర్చానీయాంశంగా మారింది. ఈ సందర్భంలో సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడం దుమారం రేపుతోంది.
హుజుర్నగర్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు...? సమావేశమైన సిపిఐ నేతలు
హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా పోటీ చేసేందుకు సిద్దమైన సీపీఎంకు షాక్ తగిలింది. ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శేఖర్ రావుకు రిటర్నింగ్ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాలు చెల్లవంటూ మెలిక పెట్టడంతో సీపీఎం నేతలు భగ్గుమంటున్నారు.
సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఫైరవుతున్నారు. నామినేషన్తో పాటు సమర్పించిన ధృవీకరణ పత్రాలు సరిగా లేనందున ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఉద్యోగులు వెల్లడించారు. ఆ క్రమంలో ఆర్వో తీరును నిరసిస్తూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. హుజుర్నగర్ లోని రిటర్నింగ్ అధికారం కార్యాలయం మెయిన్ గేట్ దగ్గర అభ్యర్థి శేఖర్ రావుతో పాటు కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.