కేసీఆర్ సర్కార్పై తమ్మినేని ఫైర్: వరంగల్ ఉపఎన్నికలో బలమైన అభ్యర్ధి
వరంగల్: కేసీఆర్ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి సీపీఎం ప్రత్యామ్నాయంగా మారిందని అన్నారు. మంగళవారం జనగామలో తెలంగాణ రైతుల సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే ఎసిరెడ్డి నర్సింహారెడ్డి 24వ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాటంతోనే ఆనాడు తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో ప్రజలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించిందన్నారు. సుదీర్ఘ ఉద్యమం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులను సంబురాల్లో ఆహ్వానించక పోడవం బాధాకరమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలోనే ప్రజల్లో అసంతృప్తి మొదలైందని అన్నారు.
అందుకు కారణం సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నేరవేర్చలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి, నిత్యావసర సరుకుల ధరల అదుపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ధ్వజమెత్తారు.
వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో వామపక్షాల కూటమి నుంచి బలమైన నాయకుడిని అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలిపారు.