క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త, కేంద్రం తీపి కబురు
క్రెడిట్ కార్డు నగదు లావాదేవీలపై కేంద్రం తీపి కబురు చెప్పింది. రూ.2 లక్షలు అంతకన్నా మించిన నగదు లావాదేవీలపై ఉన్న నిబంధనలు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవని స్పష్టం చేసింది.
హైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు నగదు లావాదేవీలపై కేంద్రం తీపి కబురు చెప్పింది. రూ.2 లక్షలు అంతకన్నా మించిన నగదు లావాదేవీలపై ఉన్న నిబంధనలు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవని స్పష్టం చేసింది.
బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్లు, ప్రీపెయిడ్ ఉపకరణాల ద్వారా ఆయా బిల్లులను చెల్లించవచ్చని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది.
తద్వారా, రూ.2 లక్షలు అంతకన్నా మించిన నగదు లావాదేవీలపై ఉన్న నిబంధనలు ఇక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవు.
ఆర్థిక చట్టం 2017 ప్రకారం రూ.2లక్షలు అంతకు మించిన నగదు లావాదేవీలపై ప్రస్తుతం నిషేధం ఉంది. ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చారు.
రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలపై పరిమితులు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, బ్యాంకులు నియమించిన వ్యాపార ప్రతినిధులు మరియు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ జారీ చేసేవారికి వర్తింపునిస్తూ ఆదాయపన్ను శాఖ భారీ ఉరటనిచ్చింది.
అయితే ఐదు అంశాలను మాత్రం ఇందులో నుంచి మినహాయించింది. బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకుల తరపున పనిచేసే బిజినెస్ కరస్పాండెంట్లు, ఒకటి అంతకన్నా ఎక్కువ క్రెడిట్ బిల్లు చెల్లింపులకు కంపెనీ లేదా సంస్థ ఇచ్చే రసీదులు, ప్రీపెయిడ్ పేమెంట్ పరికరాల ద్వారా చేసే చెల్లింపులు, రిటైల్ అవుట్లెట్లు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఏంలు ఇచ్చే రసీదులు.. ఐటీ చట్టం 1961 సెక్షన్ 10 క్లాజ్ (17ఏ) ప్రకారం వ్యక్తి మొత్తం ఆదాయంలో ఇది కలవబోదని తెలిపింది.
ఏప్రిల్ 1, 2017 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని జులై 3వ తేదీతో కూడిన నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూ శాఖ పేర్కొంది. ఈ ఉత్తర్వులు కొందరికి కచ్చితంగా ఉపశమనాన్ని కలిగిస్తాయని, ముఖ్యంగా కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించి మినహాయింపును పొందవచ్చునని నన్గియా అండ్ కో డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు.