23 ఏళ్ల తర్వాత 'పెళ్లి చూపులు' చూసిన అజారుద్దీన్
హైదరాబాద్ : టీమ్ ఇండియా క్రికెట్ లో.. కెప్టెన్ గాను, బ్యాట్స్ మెన్ గాను తనదైన ముద్ర వేసిన అజారుద్దీన్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాదీగా అజారుద్దీన్ చాలా పాపులర్.
మరి హైదరాబాదీ అయినా అజారుద్దీన్ తెలుగు సినిమాలు చూస్తారా! తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు అజారుద్దీన్. తాను తెలుగు సినిమా చూసి ఇప్పటికీ 23 ఏళ్లవుతోందని స్పష్టం చేశారు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ తీసిన 'జంబలకిడిపంబ' తెలుగులో అజారుద్దీన్ చూసిన చివరి సినిమా.
అయితే 23 ఏళ్ల తర్వాత.. తాజాగా అజారుద్దీన్ మరో తెలుగు సినిమా చూడడం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా అనే కదా సందేహం. అదే 'పెళ్లి చూపులు'. ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందేనని తన కుమారుడు అబ్బాస్ పదే పదే పట్టుబట్టడంతో.. మొత్తానికి 'పెళ్లి చూపులు' సినిమా చూసేశారు అజారుద్దీన్. ఈ విషయాన్ని అజారుద్దీన్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.