క్లోరోఫామ్ ముఖంపై అదిమిపెట్టి దోపీడీకి యత్నం
హైదరాబాద్: ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో దోపిడీ యత్నం కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. అతని వద్ద పని చేస్తున్న రికవరీ ఏజెంటే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజిగూడలోని మార్వెల్ రెసిడెన్సీ ప్లాట్ నెం. 302లో నివసించే సజ్జన్ రాజ్ జైన్ పంజాగుట్ట మహేశ్వరీ టవర్స్లో ననేష్ ఫైనాన్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు.
ఇతని వద్ద రికవీర ఏజెంట్గా బేగంపేట ప్రకాష్ నగర్ నివాసి మహ్మాద్ మాజీతద్ (28) పని చేస్తున్నాడు. నిత్యం కోట్లలో లావాదేవీలు చేసే సజ్జన్ రాజ్ జైన్ ఇంట్లో దోపిడీ చేసి.. ఆడబ్బుతో దుబాయ్ వెళ్లి స్ధిరపడాలని మాజీద్కు దురాశ పుట్టింది. యూసఫ్ గూడ, బోరబండ ప్రాంతాల్లో నివసించే తన స్నేహితులు ఫిరోజ్ ఖాన్ (29), మహ్మద్ సలావుద్దీన్ అలియాస్ సల్లూ (29), లతీఫ్ (36), జహీర్ అహ్మాద్ (29)లకు విషయాన్ని చెప్పాడు.
సజ్జన్ రాజ్ తన ఆఫీసులో ఉన్న సమయంలో భార్య అనితాదేవి ఒక్కతే ఇంట్లో ఉంటుందని తెలిసిన వీరు ఆ సమయంలో దోపిడీ చేయాలని పథకం వేశారు. దీంట్లో భాగంగా మాదాపూర్లోని ఓ ట్రావెల్స్ లో ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని దానిలో ఈనెల మొదటివారంలో సజ్జన్ రాజ్ ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఈనెల 6న దోపీడీ చేసేందుకు వెళ్లారు.
ప్రధాన నిందితుడు మాజీద్ తన యజమాని కదలికలపై ఎప్పటికప్పుడు ఫోన్లో తన సభ్యులకు సమాచారం ఇస్తుండగా, ఫిరోజ్ తన బైక్పై దోపిడీ చేసే ఇంటి వద్దకు వెళ్లి పరిసరాలను గమనిస్తున్నాడు. మహ్మద్ సలావుద్దీన్, లతీఫ్లు సజ్జన్ రాజ్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కోట్టారు.
ఆయన భార్య అనితాదేవి లోపలి నుంచి ఎవరు అని ప్రశ్నించగా... సార్ కలెక్షన్ డబ్బు ఇంట్లో ఇవ్వమని పంపారని చెప్పారు. ఆమె తలుపుతీయగానే ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె భర్తకు ఫోన్ చేసేందుకు యత్నించగా... వెంటనే వారు తమ వెంట తెచ్చుకున్న క్లోరోఫామ్ చల్లిన కర్చీఫ్ ఆమె ముఖంపై అదిమిపట్టారు.
స్పృహకోల్పోగానే చేతులు, కాళ్లు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బెడ్ రూమ్లోకి వెళ్లి బీరువా తెరిచి డబ్బులు, నగదు కోసం వెతికారు. మధ్యాహ్నం 1.15కి సజ్జన్ రాజ్ భోజనానికి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. అతను వచ్చిన విషయాన్ని తలుపు సందులోంచి గమనించిన సలావుద్దీన్ 2వ అంతస్తు బాల్కనీ పై నుంచి పైప్ పట్టుకొని కిందకు దిగగా... లతీఫ్ ఒక్కసారిగా కిందకు దూకేశాడు.
దీంతో లతీఫ్ రెండు కాళ్లు, చేయి విరిగాయి. అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న జహీర్ అహ్మద్తో కలిసి సలావుద్దీన్.... బైక్పై ఫిరోజ్ పారిపోయారు. పోలీసులు గాయపడ్డ లతీఫ్ను ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితులను ఆదివారం సాయంత్రం కృష్ణకాంత్ పార్కు వద్ద ఉండగా, పంజాగుట్ట డీఐజీ వెంకేటేశ్వర రెడ్డి తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశామని చెప్పారు.