నోట్ల కష్టాలు ఇంకెన్ని రోజుల్లో తీరుతాయంటే..?
ప్రస్తుత నోట్ల కష్టాలు జనవరి మధ్యలో దాదాపుగా తగ్గి ఫిబ్రవరి నాటికి పూర్తిగా కనుమరుగు అవుతాయని నిపుణులు అంటున్నారు.
ముంబై: నోట్ల రద్దు కష్టాలు మరికొన్ని రోజుల్లో తీరనున్నాయి. నోట్ల రద్దుతో సామాన్యులు చిల్లర కోసం, డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నోట్ల కష్టాలు జనవరి మధ్యలో దాదాపుగా తగ్గి ఫిబ్రవరి నాటికి పూర్తిగా కనుమరుగు అవుతాయని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం జోరుగా సాగుతున్న నోట్ల ముద్రణ ఇదే తరహాలో కొనసాగితే జనవరి రెండో వారం నాటికి 9 లక్షల కోట్ల రూపాయలు ముద్రితం అవుతాయని అంటున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల నుంచి వెనక్కి వచ్చిన సొమ్ములో ఇది యాభై శాతం కంటే ఎక్కువ.
ఈ నెలాఖరు నాటికి ప్రజల నుంచి బ్యాంకులలో డిపాజిట్ అయ్యే రద్దయిన నోట్ల విలువ రూ.15 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ముద్రణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి రూ.13 లక్షల కోట్లు తిరిగి చలామణిలోకి వచ్చే అవకాశముందంటున్నారు.
నోట్ల రద్దుతో పాన్ నిబంధనలు మార్పు
నోట్ల రద్దు తర్వాత కేంద్రం పలు చట్టాల్లో మార్పు చేర్పులు చేస్తోంది. తాజాగా ఆదాయపన్ను చట్టంలోని పాన్ కార్డుకుసంబంధించిన 14(బి) నిబంధనను సవరించారు. ఈ మేరకు రూ.50,000 నుంచి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాల పైనా ఐటీ అధికారులు నిఘా పెడతారు.
గతంలో పాన్ సంఖ్య ఇవ్వడం ఇష్టం లేనివారు రూ.50,000 కన్నా కొంచెం తక్కువ సొమ్మును పలుమార్లు జమ చేసేవారు. కొత్త నిబంధన ప్రకారం పాన్ సంఖ్య ఇవ్వకుండా ఒకే బ్యాంకు ఖాతాలో రూ.50,000 కన్నా తక్కువ మొత్తం పలు దఫాలుగా జమ చేసిన ఖాతాలపై ఇక నుంచి నిఘా ఉంటుంది.