పాతబస్తీలో కలకలం: నెహ్రూ జూలో తప్పించుకుని.. మూసీ నదిలో ప్రత్యక్షమైన భారీ మొసలి
హైదరాబాద్: పాతబస్తీ వద్ద మూసీ నది ఒడ్డున ఓ భారీ మొసలి ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు వెంట కావడంతో అనేకమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
జూ నుంచి తప్పించుకుని.. మూసీ నదిలో..
కాగా, మూసీ నది ఒడ్డున కనిపించిన ఆ భారీ మొసలి గత కొంత కాలం క్రితం నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తప్పించుకుందని అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా నది ఒడ్డున కనిపించిన ఆ మొసలి వెంటనే అక్కడ్నుంచి నీటిలోకి జారుకుంది. నీటిలో ఉన్నప్పుడు మొసలిని పట్టుకోవడం చాలా ప్రమాదకరమని.. భూమిపైకి వచ్చినప్పుడే బంధించాలని అటవీ శాఖ అధికారి శంకరణ్ చెప్పారు.
మూసీ నదిలో మొసళ్లు తొలిసారేం కాదట..
మొదట ఈ మొసలి బహదూర్పుర ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు అక్కడకు చేరుకుని భారీగా చేరుకున్న జనసమూహాన్ని నియంత్రించారు. మూసీ నదిలో మొసళ్లు కనిపించడంతో ఇదే తొలిసారి కాదని, ఇంతకుముందు కూడా కనిపించనట్లు సదరు అటవీ అధికారి తెలిపారు. వాటిని పట్టుకుని తిరిగి జూకు తరలించామన్నారు. మూసీ నదిలో నీటి నాణ్యత బాగా లేనప్పటికీ ఈ మొసళ్లు వించగలుగుతున్నాయని చెప్పారు.
జూ గోడ కూలి చిందరవందరగా మొసళ్లు..
కాగా, ఈ మొసలి సుమారు ఐదేళ్ల వయస్సు గలదిగా జూ అధికారులు గుర్తించారు. కొన్ని సంవత్సరాల క్రితం జూ గోడ కూలిపోవడంతో అక్కడ్నుంచి పలు మొసళ్లు సమీపంలోని మూసీ నదిలోకి వెళ్లిపోయాయని మాజీ జూ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ మీడియాకు చెప్పారు.
Recommended Video
రోజుకు 20-30 కిలోమీటర్లు ప్రయాణించగలవు..
ఈ మొసళ్లు రోజులో 20-30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవని డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ ప్రొఫెసర్ బీసీ చౌదరి తెలిపారు. 1980-1990 మధ్య కాలంలో జూలో మొసళ్ల పెంపక కేంద్రాన్ని నడిపారని చెప్పారు. మొసళ్ల పరిరక్షణ కార్యక్రమం కింద పలు పిల్ల మొసళ్లను కొన్ని నదుల్లో విడిచిపెడతారని, అయితే ఆ నదుల్లో మూసీ లేదని చెప్పారు.