శాపగ్రస్థ పదవేనా..? పీసిసి పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి ఉత్తమ్ ను వెంటాడుతున్న వివాదాలు..!!
హైదరాబాద్ : ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ పీఠంపై ఏ ముహూర్తంలో కూర్చున్నాడో కానీ, నిత్యం వివాదం, సమరమే..! ఇటు అయినవారితో. అటు ప్రత్యర్థులతో ఇరువైపులా పోరాటం చేయాల్సిన పరిస్థితులు తెలత్తాయి. ఇంతచేసినా ఏమైనా ఫలితం ఉందా అంటే ఊహూ అనే సమాధానం వస్తోంది. ఇంతగా ఉత్తమ్ను ఇరుకున పెడుతున్న నేతలంతా నల్గొండ కు చెందిన వారే.. అంటే సొంతజిల్లా నేతలే కావటం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తొలినాళ్ల నుంచి కంట్లో నలుసుగా పరిణమించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సీట్ల పంపకం పూర్తిగా హైకమాండ్ కనుసన్నల్లోనే జరిగినా.. దాని తాలూకూ అపవాదు మాత్రం ఉత్తమ్ చుట్టూ తిరిగింది. ఒకానొక దశలో పీసీపీ పీఠం నుంచి తప్పించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ విశ్వప్రయత్నం చేశారు. అతడిని తప్పిస్తే తప్ప తాము పార్టీలో ఉండబోమంటూ అల్టిమేటం ఇచ్చేంత వరకూ వెళ్లింది పరిస్థితి.
పీసిసి కి ముందు అందరి వాడు..! ఉత్తమ్ ని కొందరి వాడిగా మార్చిన పీసీసీ పదవి..!!
వీహెచ్, పొన్నాల వంటి సీనియర్లు కూడా పీసీసీ అధ్యక్షుడిగా అంగీకరించలేక పోతున్నారు. కుంటియా, భట్టివిక్రమార్క, తాజాగా జగ్గారెడ్డి.. చివర్లో రేవంత్రెడ్డి ఇప్పుడు మేకులా మారి ఉత్తమ్ను వెంటాడుతున్నట్టుగానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం ఉత్తమ్ నిర్వాహమే అనేంతగా తప్పులన్నీ ఆయన మీద నెట్టేసే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. జగ్గారెడ్డి మరో అడుగు ముందుకేసి మైక్ విసిరేశారు. రేవంత్రెడ్డి అయితే.. ఇలా మీడియా సమావేశాలతో పార్టీ బలపడదని.. జనాల్లోకి వెళ్లాలంటూ హితోపదేశం చేశారు. ఇంతకీ ఉత్తమ్ చేసిన తప్పేమిటంటే.. సీనియర్లను కాదని.. తాను పదవి చేపట్టడం. అదే సమయంలో అయినవారిని దూరంగా ఉంచటం.. కేవలం తన మాటే చెల్లుబాటు కావాలనే పంతం పట్టడం అంటూ అనుచరులు చెబుతుంటారు. దీన్ని అవకాశంగా మలచుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ చాలాసార్లు ఉత్తమ్ను పదవికి దూరం చేయాలని ప్లాన్ చేశారు.
ఒకే జిల్లా నేతలతో తలనొప్పులు..! ఏకు మేకైన కోమటిరెడ్డి బ్రదర్స్..!!
ఇక కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ సతీమణి ని ఓడించేందుకు కోమటిరెడ్డి సోదరులు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థికి సాయం చేశారనే ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. కేవలం ఉత్తమ్ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నాయట. ఎందుకంటే.. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే.. మిగిలిన సెకండ్ కేడరీ నేతల ప్రాభవం దెబ్బతింటుందనే ఆలోచన కూడా ఉందట. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ రాజీనామా చేశారు. ఇప్పుడు అక్కడ జరిగే ఉప ఎన్నికలో తన బార్యను పోటీకు నిలపాలని భావిస్తున్నారు. కానీ.. దానికి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మోకాలడ్డుతున్నారట. ఈ లెక్కన ఎటుచూసినా ఉత్తమ్ చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగిస్తున్నారన్నమాట.
సీనియర్లతో సమస్యలు..! ఎటూ తేల్చుకోలేక పోతున్న ఉత్తమ్..!!
తెలంగాణ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు నడిచారు. వీహెచ్ తన ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పంపించినట్టు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగకపోతే తానూ తన పదవిలో కొనసాగబోనని లేఖలో స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్ ఉంటేనే కాంగ్రెస్కు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాహులే బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇక కార్యకర్తల సంగతి ఏంటని వీహెచ్ ప్రశ్నించారు.
జగ్గారెడ్డి దూకుడు..! నియంత్రణ లేని నేతలు..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు నాగార్జునసాగర్లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో వాగ్వాదం నెలకొంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల విషయం చర్చకు రాగా..మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జ్లను నియమించాలని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. కొత్తవాళ్లకు ఇస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. గతంలో పోటీచేసినవారికి బాధ్యతలు అప్పగించాలని, ఓడిపోయిన సరే వారికి ఇస్తేనే బాగుంటుందని, అలాగే కొత్తవాళ్లకు ఇస్తే వాళ్లకు ఏం తెలుస్తుంది? అని ప్రశ్నించడంతో చిన్న వివాదం మొదలైంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలను కొందరు నేతలు తప్పుబట్టడంతో...నేతల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకోవడం.. కోపంతో ఊగిపోయిన జగ్గారెడ్డి మైకు విసిరేసినట్టు తెలుస్తోంది. అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగగానే తిట్టుకుంటారు..! కొట్టుకుంటారూ..! మళ్లీ ఒక్కటవుతారనే విషయం పలు సార్లు మనం చూసిందే. అందుకే కాంగ్రెస్ సంస్క్రుతి విభిన్నంగా ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు.